- ఐదో రోజూ ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టిఆర్ఎస్
- రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగాయన్న నామా
- ప్రొక్యూర్మెంట్ పాలసీ ప్రకటించాలని డిమాండ్
- రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
- రాజ్యసభకు బండాప్రకాశ్ రాజీనామా.. మండలికి ఎన్నిక కావడంతో నిర్ణయం
ధాన్యం కొనుగోళ్లపై ఐదో రోజూ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. నాలుగవ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు..వెల్లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలన్నారు. గడిచిన ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల పక్షాన నిలిచిందని లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఆయన సభలో మాట్లాడుతూ..రాష్ట్ర సర్కార్ రైతులకు అండగా నిలవడం వల్ల రాష్ట్రంలో వరిపంట ఉత్పత్తి రికార్డు స్థాయిలో నమోదయ్యిందని అన్నారు. గడిచిన ఏడేళ్లలో వ్యవసాయానికి నీళ్లు ఇస్తున్నామని, ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని, ఇంకా రైతు బంధు వల్ల కూడా తెలంగాణలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, దానితో పంట దిగుబడి కూడా పెరిగిందన్నారు. ఇప్పుడు ఇండియాలో వరిపంట ఉత్పత్తిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ఎంపీ నామా తెలిపారు. తెలంగాణ రైతుల అంశాన్ని పార్లమెంట్ వేదికగా గత మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నామన్నారు.
రాష్ట్ర వరిరైతుల అంశాన్ని పరిష్కరించాలని, ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతలను కేంద్రం విస్మరిస్తుందని నామా అన్నారు. ఇవాళ కూడా సభలో టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కూడా పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ను వెనక్కి తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రైతుల సమస్యలపై మోదీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి పట్ల విపక్షాలు భగ్గుమంటున్నాయి. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న క్రమంలో పలువురు రైతులు మరణించడం, ధరల పెరుగుదల వంటి అంశాలపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆర్జేడీ, ఐయూఎంఎల్, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే పెద్దల సభ నుంచి వాకౌట్ చేశాయి. రైతుల మృతి, ద్రవ్యోల్బణం అంశాలపై విపక్ష ఎంపీలు సభలో నినాదాలతో హోరెత్తించారు. ఇక అంతకుముందు పార్లమెంట్లో కోవిడ్-19 తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై చర్చ మొదలైంది. ఒమిక్రాన్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతుండటం పట్ల సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని మోదీ మంత్రులతో భేటీ అయ్యారు.
రాజ్యసభకు బండాప్రకాశ్ రాజీనామా..మండలికి ఎన్నిక కావడంతో నిర్ణయం
తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు అందజేశారు. బండా ప్రకాశ్ వెంట ఎంపీలు కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, సురేశ్ రెడ్డి, లింగయ్య యాదవ్ ఉన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండా ప్రకాశ్ తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన విషయం విదితమే. సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఆయన రాజ్యసభను వదులుకుని మండలికి వొచ్చారు. అయితే ఆయన రాజీనామాతో ఖాళీ అయిన సీటు ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. తొలుత కవితను రాజ్యసభకు పంపుతారని అనుకున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా మరెవరైనా వ్యాపారవేత్తకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.