- డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరణలో ఇంత విషాదమా
- తొక్కిసలాట ఘటననలపై పవన్ కళ్యాణ్ ఎందుకు నోరుమెదపరేం
- సిఎం జగన్తో భేటీ అయిన మంత్రి రోజా..
- ఎపిలో బిఆర్ఎస్ ప్రభావం నిల్ అని వ్యాఖ్య
విజయవాడ, జనవరి 2 : చంద్రబాబు తన ప్రచారానికి జనాలను బలి తీసుకుం టున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.’ ఈయన చంద్రబాబు నాయుడా.. శవాల నాయుడా..?’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు రోజా. సోమవారం తాడేపల్లిలో భర్త సెల్వమణితో కలసి సిఎం జగన్ను కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరవాత డియా సమావేశంలో రోజా మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు. రాష్టాన్రికి జగన్ ముఖ్యమంత్రి కావడం తమ అదృష్టం అని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. 2022లో చంద్రబాబు పనికి మాలిన పాత్ర పోషించాడని విమర్శించారు. ’చంద్రబాబు ఐరన్ లెగ్..వాళ్ళ కొడుకు కూడా ఐరన్ లెగ్ అయ్యారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి.
ప్రజల ప్రాణాలు తీస్తున్న వారు ఎవరైనా ఉపేక్షించం. జనం రాక చీరలు, కానుకలు ఇస్తారని పిలిచి చంద్రబాబు జనాన్ని చంపుతున్నారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాం. పనికిమాలిన వాటికి చెప్పులు చూపించే పవన్ కళ్యాణ్ మహిళలు ప్రాణాలు పోతే పట్టదా..? పవన్ కళ్యాణ్ ప్యాకేజికి తప్ప పాలిటిక్స్ కి పనికి రాడా..? ఇదేం ఖర్మ రా..బాబు అని ప్రజలు అనుకుంటున్నారని రోజా పలు విమర్శలు గుప్పించారు. జగన్ను తిట్టడానికే చంద్రబాబు రాష్ట్రానికి వస్తాడని, లోకేష్ పప్పు తినటానికి మాత్రమే పనికి వస్తాడని, దత్త పుత్రుడు పవన్ ఏమో రెండు చోట్లా ఓడిపోయాడని అన్నారు. ’చంద్రబాబు చంకలో కూర్చోవటం మినహా మరొక పని లేదు దత్త పుత్రుడికి’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని విమర్శించిన ఆమె ’విశాఖపట్నం వ్యతిరేకి పవన్ కళ్యాణ్’ అని అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నారని, వారం రోజుల క్రితం కందుకూరులో 8 మందిని, గుంటూరులో 3ని చంపేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు..? అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు.
చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్టీ అని చెప్పుకుంటూ మొత్తం 40 మంది ప్రాణాలు తీశాడని అన్నారు. అందుకే చంద్రబాబుకు ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. రాత్రి పూట డ్రోన్ షాట్ల కోసం ప్రతిపక్ష నేతలు సందుగొందుల్లో సభలు పెడుతున్నాడని అన్నారు. ఇంత జరుగుతున్నా మిగిలిన పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన రోజా లోకేష్ పాదయాత్రపై కూడా స్పందించారు. లోకేష్ పాదయాత్ర డైవర్ట్ చేయటానికే వైసీపీ నేతలు ఇది చేశారని టీడీపీ నాయకులు అంటున్నారని అలా అనడానికి వారు అన్నం తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా..? అని ఆమె ప్రశ్నించారు. ఇక టీడీపీ నాయకులకే లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచిఇంకా దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు.
లోకేష్ పాదయాత్ర పోస్టర్లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు.. లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. ఇక శాసన మండలిలో లోకేష్ అడుగు పెట్టగానే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయని పాదయాత్ర పోస్టర్ విడుదల చేయగానే 8 మంది చనిపోయారని ఆమె విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రానున్న ఏపీ ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా స్పందించారు. ’ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చెయ్యొచ్చు. ఆంధ్రప్రదేశ్ని అన్యాయంగా విభజించారు. ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. విభజన కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఆ పార్టీ వాళ్ళు ఏపీకి రావాల్సిన వాటిపై ముందుగా సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఓటుకు నోటు కేసుని అడ్డం పెట్టి ఏపీకి నష్టం చేశారు. పార్టీ పెట్టినోళ్లు, పార్టీలో చేరే వాళ్ళు ముందు వాటిపై మాట్లాడాలని అన్నారు.