తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీమ్ కోర్టు స్టే
న్యూ దిల్లీ, ఏప్రిల్ 21(ఆర్ఎన్ఎ) : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు అదేశాలపై స్టే ఇస్తే అవినాష్ను సీబీఐ అరెస్ట్ చేస్తుందని ఆయన తరుపు లాయర్లు వాదించారు. దీంతో అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 24 సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు ఆ రోజున అన్ని విషయాలు పరిశీలిస్తామని విచారణను వాయిదా వేసింది. ఈ నెల 25 వరకూ అవినాష్ను అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట్ స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం అన్ని విషయాలు పరిశీలిస్తామని కోర్ట్ వెల్లడించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో విచారణ సమయంలో చేపట్టాల్సిన అంశాలను బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోవడం సరికాదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేసులోని మెరిట్స్ ప్రకారం లేవు. హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించింది. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని బయటపెట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నెల 30 లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ సీబీఐపై ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా పనిచేసేలా చూడాలి. కానీ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు దర్యాప్తునకు అవరోధం కల్గించేలా ఉన్నాయని సిద్దార్థ లూద్రా వాదించారు. ఈ సందర్భంగా అవినాశ్ లాయర్పై సుప్రీంకోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది.