సిబిఎస్ఇ పరీక్షల షెడ్యూల్పై ప్రియాంక ఆగ్రహం
కరోనా కల్లోలం మధ్య పరీక్షలు ఎందుకంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలను రద్దు చేయాలనీ.. లేదా తిరిగి షెడ్యూల్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా ఉధృతి మధ్య సీబీఎస్ఈ లాంటి బోర్డులు విద్యార్థులను బలవంతంగా పరీక్షలకు కూర్చోబెట్టడం అత్యంత బాధ్యతా రాహిత్యం అన్నారు. పరీక్షలను రద్దు చేయాలి లేదా రీషెడ్యూల్ చేయాలి. లేదంటే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు భౌతికంగా వెళ్లే అవసరం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లయినా చేయాలని ఆమె పేర్కొన్నారు. సీబీఎస్ఈ 10, 12 తరగతుల విద్యార్థులకు మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామనీ… జూలై 15న పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంటూ డిసెంబర్ 31న కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య బోర్డు పరీక్షలు నిర్వహించి మే నెల కల్లా ఫలితాలు వెల్లడిస్తారు. కొవిడ్-19 కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యం ప్రారంభం కాగా… ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించారు. కాగా ఇవాళ దేశంలో కొత్తగా 1.31 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 1,31,968 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,30,60,542కి చేరింది.