30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్ల ద్వారా లెక్కింపు వెల్లడించిన ఎస్ఈసీ
శుక్రవారం జరిగే జీహెచ్ఎంసీ వోట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. గ్రేటర్లోని 150 డివిజన్లకు సంబంధించి వోట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారని ఎస్ఈసీ ప్రకటించింది. లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసింది. ఒక్కో డివిజన్కు 14 టేబుళ్లతో కౌటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. అయితే కౌంటింగ్ హాల్ చిన్నగా ఉన్న 16 డివిజన్లకు రెండు హాళ్లను కేటాయించారు.
ఒక్కో కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి ఉంటారని తెలిపింది. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి పరిశీలకుడిని నియమించింది. అభ్యర్థులు ఒక్కో టేబుల్కు ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఏజెంట్లకు రిలీవింగ్ సౌకర్యం లేదని స్పష్టం చేసింది. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. ఏజెంట్లు రిటర్నింగ్ అధికారుల వద్ద పాసులు తీసుకోవాలని ప్రకటించింది. పాసులు లేనివారికి అనుమతి లేదని వెల్లడించింది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఎన్నికల పరిశీలకుడి అనుమతి తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని, అనుమానిత వోట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది.