సాకేత్లో ప్రారంభించిన టిమ్ కుక్
స్టోర్ చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం
న్యూ దిల్లీ, ఏప్రిల్ 20 : యాపిల్ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్ స్టోర్ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో గురువారం తెల్లవారుజామున స్టాల్ను టిమ్ కుక్ ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే ఆపిల్ స్టోర్ ముందు ఓపెనింగ్ ను చూసేందుకు జనం తరలివచ్చారు. అనంతరం భారతదేశపు రెండవ ఆపిల్ స్టోర్ను టెక్ దిగ్గజం సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు. ఇది చూసేందుకు అనేక మంది ప్రజలు క్యూలో నిలబడ్డారు. కుక్ కస్టమర్లను స్వాగతించగా.. ఉదయం 10 గంటల ప్రాంతంలో అభిమానులతో ఫొటోగ్రాఫ్లు దిగుతూ అందర్నీ ఆకర్షించారు.
ఒక రోజు క్రితమే ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఆపిల్ మొదటి స్టోర్ను ప్రారంభించిన ఆయన..తాజాగా దిల్లీలో రెండో స్టోర్ ను ఓపెన్ చేసి వార్తల్లో నిలిచారు. ఐఫోన్ తయారీదారు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నందున టిమ్ కుక్ ఏప్రిల్19న ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. చివరిసారి 2016లో భారత్ ను సందర్శించిన కుక్.. మళ్లీ ఇప్పుడు ముంబైలో ఆపిల్ స్టోర్ ప్రారంభించడానికి, ప్రధాని మోడీని కలవడానికి ఇండియాకు వచ్చారు. అనంతరం యాపిల్ సాకేత్ ను సందర్శించే కస్టమర్లను కూడా కలిశారు. స్టోర్లో మొత్తం 70 మంది సభ్యులు పనిచేయనుండగా.. వారిలో సగం మంది మహిళలే కావడం గమనార్హం. ఈ బృందంలో భారత దేశంలోని18 వేర్వేరు రాష్టాల్ర నుండి వచ్చారు. 15 కంటే ఎక్కువ భారతీయ భాషలు మాట్లాడగల వ్యక్తులు ఉన్నారు.