ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 201కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అత్యాధునిక 108, 104 వాహనాలను బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు లక్ష జనాభాకు ఒక వాహనం మాత్రమే ఉండగా, ఇకనుంచి 50వేల మందికి ఒక వాహనం అందుబాటులోకి రానుంది. ఒకేసారి ఏకంగా 1,088 అంబులెన్స్లను (676వాహనాలు 104, 412 వాహనాలు108) సీఎం జగన్ ప్రారంభించారు.
అత్యాధునిక వైద్య సేవలందించే ఈ అంబులెన్సుల్లో 282 బేసిక్ లైఫ్ సపోర్టు కు సంబంధించినవి. ఇందులో 26 అంబులెన్సులను చిన్నారులకు(నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే కేవలం 20 నిమిషాల్లో అక్కడికి అంబులెన్స్ చేరేలా ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇక విజయవాడ నుంచి ప్రారంభమైన అంబులెన్సులు రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు