Take a fresh look at your lifestyle.

రైతన్నలకు డ్రోన్ల పంపిణీ చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు అడుగులు
అమరావతి, జనవరి 19 : వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ ‌ప్రభుత్వం. ఇప్పటికే రైతన్నల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయానికి కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులను అందిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో డ్రోన్‌ల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించనుంది. ఈ మేరకు రానున్న కాలంలో వ్యవసాయ సంబంధిత పనుల కోసం రైతులకు 2 వేల డ్రోన్‌లను పంపిణీ చేయనున్నామని కూడా తెలిపింది జగన్‌ ‌నేతృత్వంలోని అధికార వైసీపీ. ఆంధ్ర ప్రదేశ్‌ ‌వ్యవసాయాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్‌. ఈ ‌కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రంగు మారిన ధాన్యాల కొనుగోలు కోసం వైసీపీ ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, త్వరలో రైతులకు 2000 వేల డ్రోన్లు కూడా అందచేయనుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో డ్రోన్‌ ‌శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాలని వ్యవసాయాధికారలును ఆయన కోరారు.

ఏపీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమలో ఆయన ఇంకా మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రబీ సీజన్‌లోనూ వీటి సరఫరాలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. ఆర్‌బీకేల ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీపై కిసాన్‌ ‌డ్రోన్‌లు, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబరు నుంచి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్‌ ‌యూనివర్సిటీ ద్వారా డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. డ్రోన్లు, వ్యవసాయ పనిముట్ల పంపిణీ మార్చి, మే, జూన్‌ ‌నెలల్లో చేపడతామని జగన్‌ ‌తెలిపారు. ఈ మేరకు మొత్తం 2000 డ్రోన్లను పంపిణీ చేయనున్నామన్నారు. మొదటి దశలో 500 డ్రోన్లు ఇవ్వాలిని, ప్లాంట్‌ ‌డాక్టర్‌ ‌కాన్సెప్ట్‌ను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ఏటా ఏప్రిల్‌లో భూసార పరీక్ష కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను సీఎం కోరారు.

భూసార పరీక్షలు పూర్తి చేసిన తర్వాత రైతులకు పరీక్ష ధ్రువీకరణ పత్రాలు అందించి, సాగుచేసే పంటలు, వ్యవసాయ భూముల్లో వినియోగించాల్సిన ఎరువులపై అవగాహన కల్పించాలని సూచించారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్‌ ‌సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు జగన్‌ ‌పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. ప్రజలకు మినుములను పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు రూ.5,373 కోట్లతో రైతుల నుంచి ఆహార ధాన్యాలు కొనుగోలు చేశామని, సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు చెల్లింపులు వేగవంతం చేసి 89 శాతం వరకు చేశామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి రెండో వారం వరకు కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు. అయితే మిల్లర్లు, మధ్య దళారుల ప్రమేయం లేకుండా ఈక్రాపింగ్‌ ‌డేటా ఆధారంగా కొనుగోళ్లు జరపాలని జగన్‌ ‌రెడ్డి అన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ప్రస్తుత వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ‌రాష్ట్ర వ్యవసాయాధికారులకు సూచించారు.

Leave a Reply