జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం అనంతరం గ్లాండ్ ఫార్మా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించారు.
జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నదని ప్రకటించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడితో బయాలజికల్స్ లాంటి అడ్వాన్స్ ఏరియాల్లో 500 ఉద్యోగాల సృష్టి జరుగనుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్, జీనోమ్ వ్యాలీల శక్తి నిత్యం బలోపేతమవుతోందని పేర్కొన్నారు.