రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్సభ హౌస్ కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్ గాంధీ 12 తుగ్లక్ లేన్లోని ప్రభుత్వ బంగ్లాలో నివసిస్తున్నారు. ‘నోటిఫికేషన్ ప్రకారం అనర్హత వేటు వేసిన ఒక నెలలోగా ఏప్రిల్ 22 నాటికి రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాలీ చేయాల్సి ఉంటుంది. మోదీ ఇంటిపేరు’కు సంబంధించిన వ్యాఖ్యలకు 2019లో దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని సూరత్ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత శుక్రవారం రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడింది.
ఆయన అనర్హత వేటు మార్చి 23 నుంచి అమల్లోకి వొస్తుందని లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 ప్రకారం అతను (రాహుల్ గాంధీ) అనర్హుడని నోటిఫికేషన్ పేర్కొంది. బంగ్లాను ఖాలీ చేయమని నోటీసు జారీ రాహుల్ గాంధీపై బీజేపీ ద్వేషాన్ని చూపుతుందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. నోటీసు ఇచ్చిన తర్వాత 30 రోజుల పాటు, వ్యక్తి అదే ఇంట్లో నివసించవచ్చు. 30 రోజుల వ్యవధి తర్వాత మార్కెట్ ధరల ప్రకారం అద్దె చెల్లించడం ద్వారా అదే ఇంట్లో నివసించడం కొనసాగించవచ్చు. రాహుల్ గాంధీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీ కిందకు వొస్తారు..అని గుర్తు చేసారు.