- జమ్ము-కాశ్మీర్లో కొనసాగుతున్న భారత్ జోడో
- రాహుల్తో పాదయాత్రలో పాల్గొన్న ఒమర్ అబ్దుల్లా
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,జనవరి 27 : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో అంతిమ దశకు చేరుకుని జమ్ము-కాశ్మీర్లో కొనసాగుతున్నది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు విరామం అనంతరం శుక్రవారం కేంద్రపాలిత ప్రాంతం రాంబన్ జిల్లా బనిహాల్ నుండి ప్రారంభమైంది. బనిహాల్-నవ్యోగ్ టన్నెల్ వద్ద జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..రాహుల్ భారత్ జోడో యాత్రను దేశంలో పరిస్థితులను మార్చడానికి మాత్రమే కానీ, తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి కాదని అన్నారు. కాగా తీవ్రమైన చలిలోనూ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు బనిహాల్-నవ్యోగ్ టన్నెల్కు రెండు వైపులా నిలబడి తమ నేతకు స్వాగతం పలికారు. కాగా భద్రతలో తీవ్ర లోపం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో శుక్రవారం భారత్ జోడో యాత్రను మిగిలిన రోజంతా నిలిపివేశారు. యాత్ర మధ్యలో భద్రతా వైఫల్యాలతో పాటు భారీ జనసమూహాలను నియంత్రించడంలో స్థానిక యంత్రాంగం వైఫలయం చెందిందని పలువురు పార్టీ నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ…పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్లలో తీవ్ర వైఫల్యం కనిపించినందున రోజులోని మిగితా పాదయాత్రను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. జనాన్ని అదుపు చేయాల్సిన పోలీసు సిబ్బంది ఎక్కడా కనిపించ లేదని ఆయన అన్నారు. తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత జమ్ము-కాశ్మీర్లో పరిపాలన నిర్వహిస్తున్న వారిదని, కనీసం యాత్ర మిగిలిన రోజులకు వారు భద్రత కల్పిస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. యాత్ర శుక్రవారం కశ్మీర్లోకి ప్రవేశించింది. కానీ లోయలో 11 కిలోమీటర్ల మేర కొనసాగించాల్సి ఉండగా యాత్ర రద్దు చేసున్నందు సాధ్యపడలేదు. మూడు రోజుల తరావత జనవరి 30న యాత్ర శ్రీనగర్లో ముగియనుంది. కాగా జమ్ములోని వివిధ జిల్లాలగుండా 90 కిలోమీటర్ల మేర కొనసాగిందని పార్టీ సమాచార ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు.