తిరుమల, జూలై 2 : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదని వైసీపీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. తెలంగాణ అక్రమంగా నీటి జలాలను వాడుకోవడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చెయ్యడమే అని తెలిపారు. ఏపీకీ అన్యాయం చేస్తే సీఎంతో పాటు తాము సహించబోమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె డియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి వివాదాన్ని పరిష్కరించి…తమ వాటాను తమకు కేటాయించాలని మోదీ, షేకావత్కు సీఎం జగన్ లేఖ రాశారని చెప్పారు. ఏపీ నీటిని వినియోగిస్తూ చేస్తున్న విద్యుత్ ఉత్పాదన కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమని ఎమ్మెల్యే అన్నారు. కాగా.. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వంపై.. వైఎస్పై తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే.
ఈ వ్యాఖ్యలకు స్పందించిన రోజా పై విధంగా కౌంటరిచ్చారు. ఉమ్మడి జలాశయాలను ఏకపక్షంగా వాడుకోవడం తెలంగాణకు తగదన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఏపీకి అన్యాయం చేయొద్దని కోరుతున్నానన్నారు. జల వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని.. లేని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని రోజా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పవర్ జనరేషన్ పేరుతో ఆంధ్రా, రాయలసీమకు అన్యాయం చేయొద్దని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని అర్థించారు. కేఆర్ఎంబీ కేటాయింపుల ప్రకారమే తెలంగాణ నీటిని వాడుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ మంత్రులు ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని ఆమె సూచించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల విషయంలో రోజుకో మాట మాట్లాడతారని రోజా విమర్శించారు.
వైఎస్ను, జగన్ను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తే ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల భద్రత కోసం రాష్ట్రంలో సీఎం జగన్ దిశా చట్టం, యాప్, పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారని తెలిపారు. మహిళల భద్రతను పట్టించుకోని చంద్రబాబును ప్రశ్నించని తెలుగు మహిళలు… జగన్ను విమర్శించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. మహిళలు కోసం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా బారిన పడ్డ వారికి న్యాయం చేయాలంటూ బాబు దొంగ దీక్షలు చేశారని….ఈ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే రోజా తెలిపారు. 14 ఏళ్లలో ఏనాడు చంద్రబాబు మహిళల రక్షణ కోసం కృషి చేయలేదన్నారు. టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.