కాలానుగుణంగా యువత మారాలి

  • అవకాశాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
  • సమర్థతకు నైపుణ్యాలు తోడవ్వాలి
  • రాష్ట్రంలో యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీ
  • వ్యవసాయ రంగం వైపు యువత ఆకర్షించ బడడం వెనుక ప్రభుత్వ కృషి
  • యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్బంగా సిఎం కెసిఆర్‌ ‌శుభాకాంక్షలు

మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచు కోవాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని, వారికి నైపుణ్యాలు తోడైతే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని సీఎం పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని తెలిపారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడెమీ(టాస్క్)‌ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసామన్నారు. తద్వారా గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర యువతకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్రణాళికలను రచించి అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీని రూపొందించామన్నారు. ప్రత్యేకంగా టీ సాట్‌ ‌ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ స్థాయిల్లో అవగాహనతో పాటు శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదన్నారు. పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని, తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతున్నదన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. పరిశ్రమలు ఐటి రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సీఎం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలిచ్చిందని, నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని కేసీఆర్‌ ‌తెలిపారు. గత పాలనలో అన్నిరంగాల్లో శిథిలమైన మౌలిక వసతులను తీర్చిదిద్దుకుని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవింపచేసుకుంటూ వొస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

సకల జన జీవనం గుణాత్మకంగా అభివృద్ధి చెందిననాడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం విశ్వసించిందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యాచరణ చేపట్టిందన్నారు. రాష్ట్ర గ్రామీణ, పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేండ్లుగా అమలు పరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కి వొచ్చిందన్నారు. సంపదను సృష్టించి దాన్ని ప్రజలకు పంచడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పునర్నిర్మితమైన స్వరాష్ట్ర ఫలాలను యువతీ యువకులు అనుభవించే పరిస్థితులు నేడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సీఎం తెలిపారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాలను గాడిలో పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచి, రైతు సహా సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుపరుస్తూ వొస్తున్నామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలను రాష్ట్ర ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణ అని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనక రాష్ట్ర ప్రభుత్వ శ్రమ ఎంతో ఉన్నదన్నారు. పారిశ్రామిక, వాణిజ్యం, ఐటీ రంగాలు సహా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని, ఈ నేపథ్యంలో లక్షలాదిగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జరగుతుందన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

CM KCRheadlines todayprajatantra newstelugu short newstelugu storiesyouth
Comments (0)
Add Comment