- మొత్తం 339 మంది మృతి
- మంగళవారం కొత్తగా 1,211 కేసులు
- ఒక్కరోజే 117 మంది బాధితులు కోలుకున్నారు
భారత్లో కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కొరోనా హెల్త్బులెటిన్ను కేంద్రం విడుదల చేసింది. మంగళవారం కొత్తగా 1,211 కొరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొరోనాతో 31 మంది మృతిచెందారు. ప్రస్తుతం 8,988 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దేశంలో 339 మంది కోవిడ్-19 బారిన చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 1035 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజే 117 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. వచ్చే 6 వారాలకు సరిపడే టెస్టింగ్ కిట్లు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా 166 ప్రభుత్వ, 70 ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించింది. భారత్లో ఇప్పటి వరకు 2,31,902 శాంపిల్స్ టెస్టు చేశామని.. సోమవారం ఒక్కరోజే 21,635 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. కరోనా టెస్టులకు సంబంధించిన ఆర్టీ-పీసీఆర్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, దేశంలో ఇప్పటికే ఆరు వారాలకు సరిపోను టెస్టింగ్ కిట్లు ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. అధనంగా 33 లక్షల ఆర్టీ-పీసీఆర్ కిట్లు, 37 లక్షల ర్యాపిడ్ కిట్స్ కోసం ఆర్డర్ చేస్తున్నామని భారత వైద్యవిధాన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన అధికారి రమణ్ ఆర్ గంగాఖేద్కర్ తెలిపారు. ఇవి తొందర్లోనే మనకు అందుతాయని ఆయన వెల్లడించారు. సోమవారం వరకు దేశవ్యాప్తంగా 2,31,902 కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు.
భారత్ చర్యలు భేష్: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనాను నియంత్రించేందుకు భారత్ చేస్తున్న పోరాటం అద్భుతమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రశంసించింది. దేశంలో కరోనా విస్తరించకుండా భారత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం కేత్రపాల్సింగ్ అన్నారు. భారత చర్యల ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుంది. కానీ ఆరువారాల లాక్డౌన్తోపాటు సామాజిక దూరం, వైద్యసేవల విస్తరణ, రోగులకు ఐసోలేషన్, రోగులను గుర్తించటంలో చూపుతున్న వేగం వల్ల వైరస్ వ్యాప్తి అరికట్టడం సాధ్యమవుతుంది’ అని పూనం పేర్కొన్నారు.