ప్రభుత్వ లాంఛనాలతో సొంత ఫామ్హౌజ్లో పూర్తి
కట్టడి చేసినా వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చెన్నై శివారులోని పొంత ఫామ్హౌస్ ఎస్పీబీ గార్డెన్స్లో జరిగిన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక ఖననం చేశారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు అనుమతించారు. ఏపీ ప్రభుత్వ తరపున మంత్రి అనిల్ యాదవ్ హాజరై నివాళులు అర్పించారు. సినీ రంగం నుంచి విజయ్, భారతీరాజా, దేవీశ్రీప్రసాద్, మనో తదితరులు హాజరై అంతిమ నివాళి అర్పించారు. పాటల పూదోటలో పుట్టి.. సుస్వర సంగీత మాలికలల్లి .. గాన సరస్వతి కంఠాని కలంకరించి .. సుమధుర గాన ఆంభృతపు జల్లులు కురిపించిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గంధర్వ లోకానికి పయనయమయ్యారు. అశృనయనాల మధ్య బాలు అంత్యక్రియలు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్లో నిర్వహించారు.
శ్రౌతశైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖననం చేశారు. అంతకముందు సంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులు వైధిక క్రతువు పూర్తి చేశారు. భౌతికంగా బాలు మన మధ్య లేకపోయిన పాట రూపంలో ప్రపంచమంతటా ఆయన అందరి మనసులలో చిరస్థాయిగా నిలిచి ఉంటారనేది అక్షరసత్యం. ముందుగా అభిమానులకు అనుమతినివ్వని పోలీసులు వారి ప్రేమని గుర్తించి భౌతిక దూరం పాటిస్తూ చివరి చూపు చూసేందుకు అనుమతినిచ్చారు. శివసాయుధ్యం పొందిన బాలుని చివరి చూపు చూసుకునేందుకు బంధువులు, ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు. ఆయన భౌతిక దేహాన్ని చూసి ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరయ్యారు. ఫాం హౌజ్ పరిసరాలన్నీ బాలు అభిమానులతో జన సంద్రంగా మారింది. హీరో అర్జున్ మాట్లాడుతూ బాలుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని భాషలకు చెందిన ప్రముఖులు దీనిపై గట్టిగా మాట్లాడాలని అర్జున్ పేర్కొన్నారు.