చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)ను నియమించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని, దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చారని, ఇది అత్యంత మహత్తరమైన, చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం ఆయన ఇచ్చిన ట్వీట్లలో త్రివిధ దళాలు సమష్టిగా పనిచేస్తాయని, భారత దేశాన్ని దృఢంగా కాపాడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సీడీఎస్ నియామకం నవభారత ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదపడుతుందన్నారు. ప్రధానినరేంద్ర మోదీమరొక దీర్ఘకాలిక డిమాండ్ను నెరవేర్చారు, భారత దేశానికి మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చారు, ఇది భారత దేశానికి అత్యంత మహత్తరమైన, చరిత్రాత్మక రోజు. ప్రపంచంలో అత్యుత్తమ రక్షణ దళాల్లో ఒకటిగా ఉండాలన్న భారత దేశపు దృఢ నిశ్చయాన్ని ఈ నిర్ణయం మరింత బలోపేతం చేస్తుందన్న నమ్మకం నాకు ఉందని అమిత్ షా పేర్కొన్నారు.
భారత దేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ బిపిన్ రావత్ను అభినందిస్తున్నాను. ఆయన నాయకత్వంలో త్రివిధ దళాలు సమష్టిగా ఓ జట్టుగా పని చేస్తాయని, అన్ని వైపరీత్యాల నుంచి మన దేశాన్ని కాపాడటానికి ఏ అవకాశాన్నీ వదిలిపెట్టవని విశ్వసిస్తున్నానని మరొక ట్వీట్లో పేర్కొన్నారు.భారత సాయుధ దళాలలోని మూడు విభాగాల సిబ్బంది సంక్షేమం, మన సైన్యం ఆధునికీకరణ, నవభారతం పట్ల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరింత ముందుకు తీసుకెళ్తారని మూడో ట్వీట్లో అమిత్ షా పేర్కొన్నారు. సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
Tags: amit shah, cds general bipin ravat, narendra modi, Chief of Defense, Staff Law, historic