కేంద్రం సమయం వచ్చే వరకు దిల్లీలోనే..!

  • తెలంగాణ రైతాంగాన్నికేంద్రం అవమానిస్తుంది
  • తెలంగాణ రైతు సమస్యల మీద చర్చలకు మంత్రుల డిమాండ్‌

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ,డిసెంబర్‌ 20: ‌వరి ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేయాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.దిల్లీకి చేరిన తెలంగాణ మంత్రులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలోపలు అంశాలు మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా 6952 కొనుగోలు కేంద్రాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నది అని తెలిపారు. కేంద్రం అనుమతించిన మేరకు 60 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం టార్గెట్‌ ఈ ‌సోమవారంతో పూర్తవుతున్నది అని ప్రకటించారు.కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం తగ్గేందుకు ఆరబెట్టిన మరో 12, 15 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం తూకాలకు సిద్దంగా ఉంది అని తెలిపారు. టార్గెట్‌ ‌పెంచాలని కేంద్రానికి ఇది వరకే తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది అని తెలిపారు. ఇవి కాకుండా జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా పాత ఖమ్మం, పాత నల్లొండ, పాత పాలమూరు కొన్ని నియోజకవర్గాలలో ఇంకా వరి కోతలు జరగవలసి ఉన్నది.

ఆ ధాన్యం కూడా అమ్మకానికి సిద్ధం కానున్నదని తెలిపారు. వరి కోతలు జనవరి 15 వరకు జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు చెబుతున్నారు.పండిన వరి ధాన్యం అంతా కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రంతో ఇప్పటి వరకు అనేక చేధు అనుభవాలు ఎదురయ్యాయని అందుకే ఈ అంశంలో లిఖిత పూర్వక హామీ కోరుతున్నాం అని మంత్రి తెలిపారు. రాజకీయాల కోసం దిల్లీకి రాలేదు .. రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పేందుకు వచ్చాం మాత్రమే వచ్చామని తెలంగాణ మంత్రుల బృందం ప్రకటించింది. కేంద్రం రాష్ట్రాలను, రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను రాజకీయ కోణంలో చూడడం మానేసి రైతుల దృష్టితో చూడడం అలవరుచుకోవాలి అని హితవు పలికారు. శనివారం సాయంత్రం నుండి గత రెండు రోజులుగా కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌ను కలిసేందుకు రాజ్యసభలో పార్టీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ఎం‌పీ కేశవరావు , లోక్‌ ‌సభ పార్టీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌నామా నాగేశ్వర రావు కార్యాలయాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అని అయినా అపాయింట్మెంట్‌ ‌దొరకడం లేదని తెలిపారు. ఇంతవరకు కేంద్ర మంత్రి కార్యాలయం నుండి భేటీకి అనుమతిస్తూ ఎలాంటి సమాచారం రాలేదు..అయినా కేంద్ర మంత్రి సమావేశం సమయం ఇచ్చే వరకు మా బృందం దేశ రాజధాని దిల్లీలో వేచిచూస్తుంది అని తెలంగాణ మంత్రుల బృందం ప్రకటించింది.

రైతాంగానికి సంబంధించిన అంశాల మీద రాష్ట్రాల నుండి వచ్చినప్పుడు సమయం ఇచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కారమార్గం చూయించడం కేంద్రం కనీస బాధ్యత అని తెలంగాణ మంత్రుల బృందం అభిప్రాయపడింది.ఇష్టముంటే కలుస్తం .. లేకుంటే లేదు అన్న ధోరణిలో కేంద్రప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. కేంద్రం వ్యవహారశైలి తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమేనాని వెంటనే కేంద్రం పునరాలోచించి మంత్రుల బృందానికి సమయం కేటాయించాలి అని డిమాండ్‌ ‌చేసింది తెలంగాణ మంత్రుల బృందం. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణలోని 12,600 పై చిలుకు గ్రామాలలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు ఈ విషయాన్ని కేంద్రం గమనించాలి అని మంత్రుల బృందం కోరింది.

కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి వానాకాలం వరి ధాన్యం టార్గెట్‌ , ‌పెంచాలనేదానికి, రాబోయే యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అనేదానికి తేడా తెలియదు .. వారికి అవగాహన లేక పొరపడుతున్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డితో పాటుగా పార్టీ పార్లమెంట్‌ ‌ఫ్లోర్‌ ‌లీడర్లు ఎంపీలు కేశవరావు ,నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమాలకర్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, జగదీశ్వర్‌ ‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎంపీలు రంజిత్‌ ‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment