వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం విశ్వనాధ పల్లి గ్రామ పంచాయతీకి చెందిన స్మశానవాటిక నిరుపయోగంగా తయారైంది.ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో ఇక్కడ స్మశాన వాటికను నిర్మించేందుకు గతంలో నిధులను మంజూరు చేయడం జరిగింది.అయితే ఈ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టరు అసంతృప్తిగా నిర్మాణం చేపట్టి మధ్యలోనే చేతులెత్తేశా డు.దాంతో అప్పటి నుండి విశ్వనాధపల్లి స్మశాన వాటి క క్రమక్రమంగా శిధిలావస్థకు చేరుకుంటుంది. ఇటీవల వీచిన బలమైన గాలులకు షెడ్డుపై ఉన్న రేకులు మొత్తం ఎగిరిపోయాయి.విశ్వనాధపల్లి స్మశాన వాటిక మంజూరైన సమయంలోనే మాదారం,సింగరేణి గ్రామ పంచాయతీలకు కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులను మంజూరు చేయడం జరిగింది.ఆ గ్రామ పంచాయతీలలో కూడా గుత్తేదారులు పూర్తిగా పనులు చేపట్టకపోవడంతో సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్లు ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మాణాలను పూర్తి చేశారు.మాదారం గ్రామ పంచాయతీలో నిర్మించిన స్మశానవాటిక మండలానికే ఆదర్శంగా ఉండడంతో అక్కడి సర్పంచ్ అజ్మీరా నరేష్ను జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.
అదేవిధంగా సింగరేణి గ్రామపంచాయతీ స్మశానవాటిక కూడా ఉపయోగంలోకి రావడంతో ఆగ్రామపంచాయతీ ప్రజలు సద్విని యోగం చేసుకుంటున్నారు. విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ స్మశానవాటిక మాత్రం రోజురోజుకి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ గ్రామపంచాయతీ ప్రజలు పంచాయతీ పాలకవర్గం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక, రెండో విడత పల్లె ప్రగతిలో భారీగా నిధు లను మంజూరు చేసి స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులకు ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చింది.అయినప్పటికీ ఈపంచా యతీ పాలకులు స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదని స్థానిక గ్రామ పంచాయతీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న విశ్వనాధపల్లి స్మశాన వాటికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆ గ్రామపంచాయతీ ప్రజలు కోరుతున్నారు.ఈవిషయమై స్థానిక ఎంపీడీవో మాచర్ల రమాదేవిని వివరణ అడగగా ఇప్పటికే సర్పంచ్తో కలిసి స్మశాన వాటిక దగ్గరకు వెళ్లి పరిశీలించామన్నారు. పంచాయతీ తీర్మానంతో ప్రత్యేక నిధులను కేటాయించి నిలిచిపోయిన స్మశాన వాటిక నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. అయినప్పటికీ సర్పంచ్ ముందుకు రావడం లేదని తెలిపారు.