బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
ఈ విషయం తెలియగానే కురు సభాభవనం పురప్రముఖులతో నిండిపోయింది. ఆట మొదలుపెట్టారు. ధర్మరాజు ఓడుతున్నాడు. ఓడినకొద్దీ పందాన్ని పెంచడం ప్రారంభించాడు. ధర్మరాజు ద్యూతంలో సర్వసంపదలనూ కోల్పోయాడు. తమ్ములను ఒడ్డి ఓడిపాయాడు. శకుని పాచికలను గలగలలాడిస్తూ నవుతున్నాడు. విదురుడు ధృతరాష్ట్రునికి ద్యూతాన్ని ఆపమని చెబుతూనే ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు వినపడనట్లుగా పట్టించుకోలేదు. ద్యూతంలో హరించిన సిరిసంపదలు సత్ఫలాలను అందించవన్నాడు. కంసుడు తండ్రిని ఎదిరించి ఎన్నో అత్యాచారాలు సాగించగా ప్రజాభిమతం మేరకు కృష్ణుడు అతగాడిని సంహరించిన విషయాన్ని గుర్తు చేశాడు. తన కొడుకుని అదుపులో వుంచితే భవిష్యత్తులో ఏ ప్రమాదమూ రాదన్నాడు. కురువంశమూ ప్రజలూ సుఖసంతోషాలతో వుంటారన్నాడు. వంశం కోసం వ్యక్తినీ దేశం కోసం గ్రామాన్నీ గ్రామం కోసం దుష్ట మార్గాన్నీ ఆత్మరక్షణకు భూమండలాన్నీ విసర్జించాలని శాస్త్రాల్లోని విషయాలను చెప్పాడు. అయినా ధృతరాష్ట్రుడు వినలేదు.
విదురుడు దుర్యోదనుడికి కూడా చెప్పిచూశాడు. కావల్సిన సంపదలన్నీ జూదంలో సంపాదించాడు. కావున ఇంకా ముందుకు సాగవద్దన్నాడు. శకుని కపట ద్యూత కుశలుడు కావున అతనిని వారించమన్నాడు. జూదాన్ని ఆపి ధర్మ స్వరూపులైన పాండవులతో సఖ్యం చేసుకోమన్నాడు. ఈ విధమైన బోధలు దుర్యోదమనుడికి నచ్చలేదు. విదురుడు ఎప్పుడూ తన శత్రువులనే కీర్తిస్తున్నాడన్నాడు. పాండవ పక్షపాతి అన్నాడు. తన సలహాలు అవసరం లేదన్నాడు. స్వపక్షం వారిని అవమానించే తనకు స్థానం లేదన్నాడు. తన ఇష్టం వచ్చిన చోటుకి పొమ్మన్నాడు. విదురుడు తన ప్రయత్నం మానలేదు. సుయోదనుడికిలాచెప్పాడు. ‘సుయోదనా! నీ మనస్సుకు నచ్చేవిధంగా మాట్లాడేవారు ఎందరో ఉంటారు. అప్రియమైన విషయాలైనా నీకు చెప్పగలిగిన వాడే మంచి స్నేహితుడు. మనస్సుకు కష్టం కలిగించినా శ్రేయోదాయకమైన హితవును వినగలిగినవాడే మంచి స్నేహితుడు! కురువంశ శ్రేయస్సు తప్ప నాకు మరే కోరిక లేదు.