ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ :ఏఎస్పీ డా.వినీత్
భద్రాచలం,జూలై 31 (ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం పట్టణంలోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద శుక్రవారం నాడు తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమ గంజాయి తరలించడాన్ని గమనించిన పట్టణ పోలీసులు తనిఖీ చేయగా 300 కేజీల గంజాయిని పట్టకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ డా.వినీత్ తెలిపారు. శనివారం నాడు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో భద్రాచలం పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో పట్టణ ఎస్.ఐ ఎస్.మధు ప్రసాద్ మరియు సిబ్బంది కలిసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక మహీంద్రా ఎపి39 ఎఫ్క్యూ 4995 కారులో మరియు హోండా యునికార్న్ టిఎస్ 04 ఇవి 6824 నెంబర్ గల మోటార్ సైకిల్ వాహనాలలో, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తూ కనిపించగా వారి వాహనాల్ని తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ తనిఖీ లో వీరి వద్ద 300 కేజీల గంజాయి లభించిందని, దీని విలువ సుమారు 60లక్షల రూపాయలు ఉంటున్నట్లు తెలిపారు.
ముద్దాయిలను విచారించగా వారి పేర్లు ఆలూరి జయమ్మ ,శీలం రాజశేఖరరెడ్డి, సాధం సతీష్ అని, వీరు ఖమ్మం జిల్లాలోని తల్లాడ మరియు వైరా మండలానికి చెందినవారని చెప్పినట్లు ఆయన వివరించారు. వీరు ఈ గంజాయిని ఒడిశా తెలుగు క్యాంపు నుండి హైదరాబాద్కు తీసుకు వెళ్తున్నారని ఏఎస్పీ తెలిపారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మరే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి.స్వామి, పట్టణ ఎస్.ఐ మధు ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.