విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలి
ఎయిమ్స్ చీఫ్ గులేరియా సూచన
కొరోనా కేసులు తక్కువగా ఉన్న చోట విద్యా ససంస్థలను నిబంధనల మేరకు తగు జాగ్రత్తలతో తెరవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచించారు. కొరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో స్కూళ్లను తెరవాలన్నదే తన సూచన అని అన్నారు. కొరోనా వ్యాప్తి భయంతో దేశంలో గతేడాది మార్చి నుంచి స్కూళ్లు మూసేసి ఉన్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో ఇప్పట్లో బడులు తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయంపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా స్పందించారు.
కొరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లను రీ ఓపెన్ చేయాలని గులేరియా సూచించారు. పాజిటివిటీ రేటు 5 శాతం లోపు ఉన్న ఏరియాల్లో బడులను ప్రణాళికాబద్ధంగా తెరవాలి. స్కూళ్ల తెరిచివేతపై ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నారు. స్కూళ్ల తెరచివేత దిశగా ప్రభుత్వాలు, అధికారులు కృషి చేయాలి. ఇప్పటికే పిల్లలు ఎంతో కోల్పోయారు. ముఖ్యంగా ఆన్లైన్ క్లాసులకు హాజరుకాలేని అట్టడుగు వర్గాల పిల్లలు జ్ఞానం పరంగా చాలా నష్టపోతున్నారని గులేరియా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తగు చర్యలు తీసుకుని కట్టుదిట్టమైన జాగ్రత్తలతో స్కూళ్లు తెరవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇది ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.