హెచ్‌సీయూ స్కాలర్‌ రోహిత్‌ వేముల కేసు పునర్విచారణ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
సిఎం రేవంత్‌ను కలిసిన రోహిత్‌ తల్లి  : న్యాయం చేస్తామని హామీ  ఇచ్చినట్లు వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 4 : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును తిరిగి విచారించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిజిపి ప్రకటన చేశారు.  దేశవ్యాప్తంగా ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా.. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్దారించారు.

2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆత్మహత్యకు సంబం ధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. దీంతో ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తేల్చారు. అంతేకాదు.. రోహిత్‌ వేముల ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకుడు కాదని కోర్టుకు సమర్పించిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే, రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును క్లోజ్‌ చేయడంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో కేసును మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. కేసును రీఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా నిర్ణయించారు. ఈ క్రమంలోనే పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో తెలంగాణ పోలీస్‌ శాఖ పిటిషన్‌ దాఖలు చేయనున్నది.

సిఎం రేవంత్‌ను కలిసిన రోహిత్‌ తల్లి : న్యాయం చేస్తామని హామీ  ఇచ్చినట్లు వెల్లడి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును తెలంగాణ పోలీసులు క్లోజ్‌ చేశారు. దీనిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు వివిధ సంఘాలు, రోహిత్‌ వేముల తల్లి రాధిక వేముల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం హెచ్‌ సీయూ ఎదుట భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎనిమిదేళ్లుగా కొనసాగిన దర్యాఫ్తును నిలిపివేయడం, రోహిత్‌ వేముల ఎస్సీ కాదని తేల్చడంపై మండిపడ్డారు. ఈ విషయంపై రాధిక వేముల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలుసుకున్నారు.

తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఓ వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు ఇప్పటికే రీఓపెన్‌ చేయించామని వివరించారు. రోహిత్‌ మరణానికి కారణమైన వాళ్లకు శిక్ష పడేలా చూస్తామని, న్యాయం చేస్తామని హావ్ని ఇచ్చారు. ఈ కేసును రీ ఓపెన్‌ చేసినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి రాధిక వేముల కృతజ్ఞతలు తెలిపారు.

Comments (0)
Add Comment