- ప్రత్యేక బృందం తక్షణ చర్యలు
- ప్రాజెక్టును కాపాడుకోవడానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం
రామ కిష్టయ్య సంగన భట్ల…
గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన స్పెషల్ టెక్నికల్ టీం రాత్రింబవళ్లు ప్రాజెక్టు వద్దే మకాం వేసి గేట్లకు, కౌంటర్వేటర్ల మరమ్మతులను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 18 గేట్లు వరద ప్రవాహానికి దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు గేట్లు కిందికి దిగకపోవడంతో వరద ప్రవాహం ఉదృతి కారణంగా ప్రాజెక్టు తెగి, కొట్టుకు పోవచ్చని సంకేతాలు రాగా, అధికారులు దిక్కు తోచక చేతులెత్తేశారు. కడెం ప్రాజెక్టు గరిష్ఠ ఎత్తు 700 అడుగులు కాగా…వరద నీటి ఉధృతికి ఎడమ కాలువ తెగి వరద నీరుదిగువకు వెళ్లడంతో కడెం ప్రాంతంలోని సుమారు 12 గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రి ఇతర సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించక తప్పలేదు.
ఆదిలాబాద్ జిల్లాలోని 25000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందించే లక్ష్యంతో, అవిభక్త ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత విభక్త నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఉపనది అయిన కడెం, గోదావరి నదిలో కలిసే ప్రదేశం నిర్మల్ పట్టణం నుండి 40 కి.మీ దూరంలో పెద్దూరు గ్రామం వద్ద కడెం ప్రాజెక్టు నిర్మించారు. 1944లో నిజాం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు తయారు చేయగా….1949 నుంచి 1952 మధ్య కాలంలో ప్రాజెక్టును నిర్మితమైంది. ఆ ప్రాంత నాయకుడు కడెం నారాయణరెడ్డి జ్ఞాపకార్థం కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్గా అధికారికంగా నామాంకిత అయింది.
ఆదిలాబాద్ జిల్లా బోర్డ్ సమీపంలోని పొచ్చెర, ఇచ్చోడ వద్ద ఉన్న కుంటాల జలపాతం వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతోనే మొదలవుతుంది. కడెం ప్రాజెక్టు మొదట 5.5 -టీఎంసీల సామర్థ్యంతో కొన్ని గేట్లు 2.50లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాటిసితో నిర్మించారు. ఇది ఎడమ, కుడి కాలువల ద్వారా అనేక మండలాలకు నీరును అందిస్తుంది. ఎడమ కాలువ ద్వారా పెద్ద బెల్లాల్, చిన్న బెల్లాల్, చిట్యాల్, కొండుకూర్, కన్నాపూర్, మోరిగూడెం, పాత కొండుకూర్, ఉప్పరగూడెం, చిన్నా శిబిరం, పెర్కపల్లి, కడెం మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది. కుడి కాలువ ద్వారా జన్నారం, దండేపల్లి, తాళ్లపల్లి, మ్యాదార్ పేట్, లక్సెట్టిపేట మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది.1984లో శ్రీరాంసాగర్ నార్తు కెనల్ సరస్వతీ కాలువ నుండి కడెం ప్రాజెక్టుకు లింకు చేశారు. దీంతో మొత్తం 68వేల ఎకరాల ఆయకట్టుకు కడెం ప్రాజెక్టు నుండి నీరు అందుతుంది. కడెం ప్రాజెక్టు దిగువన ఐదారు కిలోమీటర్ల దూరంలో కడెం నది గోదావరిలో కలుస్తుంది. అలా ప్రస్తుతం ఈ డ్యామ్ 68000 హెక్టార్ల వ్యవసాయానికి సాగునీటి అవసరాలను తీరుస్తుంది.
1958 ఆగస్టు 30, 31న వొచ్చిన వరదకు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 5.19 లక్షల క్యూసెక్కుల వరద వొచ్చి ఉంటుందని అప్పటి అధికారులు అంచనా వేశారు. అంటే ప్రాజెక్టుకు డిశ్చార్జి కెపాసిటి కన్నా రెండింతల వరద ఎక్కువగా వొచ్చింది. ఈ డ్యామ్ను కాపాడటం కోసం అప్పటి ఏఈ చంద్రశేఖర్ డ్యామ్ను బ్రీచ్ సెక్షన్ వద్ద డిటోనేటర్తో పేల్చి కట్టను తెంపాలని విఫల ప్రయత్నం చేశారు. తర్వాత ప్రాజెక్టు ఎత్తును 1.20 మీటర్ల పాతవి, కొత్తవి కలిపి 18 గేట్ల 3.28 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటీతో ప్రాజెక్టును 1959 నాటికి పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ 1995లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వరద తాకిడికి కడెం ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకు పోయాయి.
పొచ్చెర, కుంటాల, బజార్ హత్నూర్ ప్రాంతాల్లో గుట్టల పైనుండి వచ్చే వరద నీరు చేరుతుండటం, ఇసుక మేటలు వేస్తున్న కారణంగా ఏటా మామూలు రుతుపవన వర్షాలకే ప్రాజెక్టు నిండు కుండగా మారుతున్నది. ఇక ప్రస్తుతం…కడెం ప్రాజెక్టు గరిష్ఠ ఎత్తు 700 అడుగులు కాగా…ఇటీవల కురిసిన భారీ వర్షాలకుపై నుండి వరద నీరు చేరడంతో, ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా, 17 గేట్లు మాత్రమే తెరుచుకున్నాయి. సాంకేతిక లోపంతో 18వ గేటు తెరుచుకోలేదు. గతంలో గరిష్ఠగా 2.90 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ఈసారి ఒకేసారి 5 లక్షల క్యూసెక్కుల పైన వొచ్చిన కారణంగా…అధికమైన నీరు గేట్ల పైనుండి పారిన నేపథ్యంలో అధికారులు చేతులెత్తక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు ఎడమ కాలువకు గండి పడటంతో భారీగా వరద నీరు బయటకు వెళ్ళిపోయి, ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే గేట్లలో చెట్లు, కొమ్మలు, చెత్తా చెదారం ఇరుక్కుపోయి మూసి వేయలేని స్థితి తయారైంది. మొత్తంగేట్లు కిందికి దిగని కారణంగా ఇప్పటి వరకు 40 టీఎంసీలకు పైగా వరద నీరు గోదావరి పాలైంది. మొత్తం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.6 టీఎంసీలు కాగా, రిజర్వాయర్లో ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న నీటినంతా గోదావరి నదిలోకి నిరంతరం వదులుతోనే ఉన్నారు. ఇక కడెం రిజర్వాయర్లో నీటి నిల్వ అసాధ్యం అయింది.
జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రాజెక్టు గేట్ల పరిస్థితిని పరిశీలించిన ప్రత్యేక నిపుణుల బృందం తక్షణ చర్యలు చేపట్టింది. యుద్ధప్రాతిపదికన 15 మందితో కూడిన టెక్నికల్ బృందం ఆపరేషన్ అండ్ మెయిన్టెనెన్స్ నిధులతో మరమ్మతులు చేపట్టింది. ప్రాజెక్టు రెండో గేటు, మూడోగేటుకు సంబంధించి కౌంటర్వేటర్లు వరద ఉధృతికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదనీటిలో మునిగి 9 జర్మనీ గేట్లకు నష్టం కలిగింది. ఏడు స్వదేశీ గేట్లు చెడిపోయాయి. దాదాపు రూ.7కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అంచనా వేసిన నేపథ్యంలో…ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులతో మరమ్మతు పనులు చేపడు తున్నారు. ఇరిగేషన్ ఎస్ఈ సుశీల్ కుమార్, డీఈ రాజశేఖర్ ల పర్యవేక్షణలో స్పెషల్ టీం రాత్రింబవళ్లు గేట్ల మరమ్మతు లతో పాటు కౌంటర్వేటర్లకు రిపేర్లు నిర్వహిస్తున్నారు. అలాగే ఆదివారం సాయంత్రం వరకు 11గేట్లను మానవ ప్రయత్నంలో మూసి వేయగలిగారు. ఈ నెల 25వ తేదీలోగా కడెం ప్రాజెక్టు మరమ్మతులు పనులను పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ ఎస్ఈ సుశీల్ కుమార్ చెపుతున్నారు. భారీ వరద నీరు తట్టుకునేలా, వరద తాకిడి నుండి కడెం ప్రాజెక్టును కాపాడుకునేలా శాశ్వత పరిష్కారం కోసం కనీస డిశ్చార్జి కెపాసిటీని 5 లక్షల క్యూసెక్కులకు పెంచేవిధంగా తక్షణ చర్యలు తీసుకోక తప్పని స్థితి నెలకొంది.