- ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ వాతావరణకేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ విభాగం అధికారి రాజారావు హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. కేవలం భారీ వర్షాలే కాదు..బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వీటి తీవ్రత కారణంగా చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకూలే స్థాయిలో వుంటుందని ఆయన పేర్కొన్నారు .
రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం వుందని రాజారావు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం వుందన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం వుందని, తీవ్రమైన స్థాయిలో పంట నష్టం జరిగే అవకాశం వుందని ఆయన వివరించారు. రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందనీ అందువల్ల ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, భదాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలుస్తోంది. రాజధాని హైదరాబాద్ కూడా భారీ వర్షాల కురిసే జోన్లో వుందన్నారు.