ఎట్టికైనా, మట్టికైనా మనోడో కావాలె

  • దొంగ రేవంత్‌రెడ్డిని నమ్మితే ఇక అంతే
  • తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే
  • రైతు బంధు, దళిత బంధు కలలోనైనా ఊహించామా

మంత్రి కెటిఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌, ‌రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదని, ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ ‌సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ…నల్లగొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచేది పైళ్ల శేఖర్‌ ‌రెడ్డి అని కేటీఆర్‌ ‌తెలిపారు. సొంతింటికి తిరిగి వొచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దారి తప్పిన కొడుకు ఇంటికి తిరిగొచ్చినట్టుందని, ఈనగాసి నక్కలపాలు చేయొద్దని కలిసి వొస్తున్నారని కెటిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. రూ. 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ ‌రెడ్డి అని, సోనియా గాంధీని బలి దేవత అన్నది రేవంత్‌ ‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఉద్యమంలో బిడ్డలు అమరులు కావడానికి కాంగ్రెస్‌ ‌కారణమని, సోనియమ్మ దయతలచి తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్‌ ‌నేతలు అంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ‌లేకుంటే టీపీసీసీ, టీబీజేపీ ఉండేవా? అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు.
కాంగ్రెస్‌, ‌బీజేపీ జాతీయ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. తాము ఎవరికి ఏ టీం, బీ టీం కాదని, తెలంగాణ ప్రజల టీమ్‌ అని స్పష్టం చేశారు. రాహుల్‌ ‌గాంధీని ముద్దపప్పు అన్నది రేవంత్‌ ‌రెడ్డేనని, రేవంత్‌ అవసరానికి కండువా మార్చుకుంటే తామంతా మారాలా..అంటూ కెటిఆర్‌ ‌ప్రశ్నించారు. తెలంగాణ ఆకాంక్షలను మొదటి నుంచి అణిచివేసింది కాంగ్రెస్సేనని, బీసీ జన గణన చేయాలని అడిగితే మోదీ పెడచెవిన పెట్టారని, తెలంగాణ ప్రజల్ని గుజరాతీ విముక్తి చేస్తాడని మోదీ అన్నారని ఆయన గుర్తుచేశౄరు. తెలంగాణలో తాము ఏం చేయలేదని ఓడిస్తారని కెటిఆర్‌ ‌ప్రశ్నించారు. సాగు, తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి ఇస్తున్నామని, అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని, అన్ని కులవృత్తుల వారిని అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణలో ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నామని అన్నారు. ముదిరాజ్‌ ‌బిడ్డలకు గౌరవం ఇచ్చింది సీఎం కేసీఆరేనని, కేసీఆర్‌ ఏకు మేకు అయితడని కాంగ్రెస్‌, ‌బీజేపీకి భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్‌కు ఐదారుగురు ముఖ్యమంత్రులు దొరికినా, వోటర్లు దొరకడం లేదని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అయితడని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.
కెటిఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌, ‌రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా అధికార పార్టీ బిఆర్‌ఎస్‌లోకి బిజెపి, కాంగ్రెస్‌ల నుంచి ఆయా పార్టీల నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌నుంచి టిక్కెట్లు ఆశించిన వారికి అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండకపోవటంతో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఎక్కువగా మంత్రులు కెటిఆర్‌, ‌హరీశ్‌రావుల సమక్షంలో ఈ చేరికలు ఉండటం గమనార్హం. అయితే ఈసారి మళ్లీ బిఆర్‌ఎస్‌ ‌పార్టీనే అధికారంలోకి వొస్తుందని ఇప్పుడు పార్టీలోకి వొచ్చిన వారికి వెంటనే ప్రాధాన్యత లేకపోయిన తరువాత మంచి పదవులు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ‌రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌సమక్షంలో బాలకృష్ణారెడ్డి, రాజేందర్‌ ‌గులాబీ గూటికి చేరారు. వీరిద్దరికి కేటీఆర్‌ ‌గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  ఇక వనపర్తి జిల్లాకు చెందిన సీనియర్‌ ‌నాయకులు రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. వనపర్తి జిల్లాలో రావుల చంద్రశేఖర్‌ ‌రెడ్డికి మంచి పట్టుంది. ఇక మంత్రి హరీష్‌ ‌రావు ఆధ్వర్యంలో మాజీ జెడ్పిటిసితోపాటు బిజెపి, కాంగ్రెస్‌ ‌నాయకులు బిఆర్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో గెలిచేది ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ ‌పార్టీయేనని స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ప్రజలకు అపారమైన ప్రేమ ఉందన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్‌ ‌కొట్టేది ‘కారే’ అని చెప్పారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంగారెడ్డి జిల్లా అందోల్‌ ‌నియోజకవర్గం అల్లాదుర్గ్ ‌మండల మాజీ జెడ్పీటీసీ మమతా బ్రహ్మంతోపాటు పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల నాయకులు మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న బ్రహ్మం ప్రస్తుతం బీజేపీలో వున్నారు. ఆయనతోపాటు మెదక్‌ ‌జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు సాయిలు, యువజన నాయకులు పవన్‌, ‌వార్డు మెంబర్‌ ‌నర్సింహ, యువజన సంఘాల మండల అధ్యక్షులు మహేష్‌ ‌గౌడ్‌, ‌బీజేపీ యూత్‌ అధ్యక్షుడు ఆంజనేయులు, రేగోడ్‌ ‌మండల బీసీ సంఘ అధ్యక్షులు శేఖర్‌ ‌బీజేపీ మోర్చ నాయకులు శేఖర్‌తోపాటు 100 మంది కాంగ్రెస్‌, ‌బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు.
Jitta Balakrishna ReddyMamilla Rajender and Raoula Chandrasekhar Reddy joined BRS in the presence of KTR.
Comments (0)
Add Comment