ఆత్మీయ పలకరింపులతో ఉత్సహంగా ముందుకు
పెరిగిన గ్యాస్ ధరలపై రాహుల్ మండిపాటు
గ్యాస్ సిలిండర్ కటౌట్లు, బ్యానర్లతో కార్యకర్తల నిరసన
తిరువనంతపురం, సెప్టెంబర్ 25 : ఆదివారం రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను కేరళలోని త్రిసూర్ జిల్లా తిరూర్ పట్టురాయ్కల్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. 18వ రోజు పాదయాత్రను ఉదయం 6.30 గంటలకు ప్రారంభించి 10 గంటలకు ఉదయం సెషన్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ వద్ద ముగించారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వడక్కంచెరి బస్ స్టాప్ వద్ద ప్రారంభించి రాత్రి 7 గంటలకు త్రిసూర్ జిల్లా, చెరుతిరుతి, జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద యాత్ర ముగించారు. త్రిసూర్లో పలు చోట్ల మహిళలు, పిల్లలు రాహుల్ను కలువడానికి భద్రతా వలయాన్ని ఛేదించుకుని ముందుకు రావడానికి ప్రయత్నించిన దృశ్యాలు కనిపించాయి.
కాగా రాహుల్ గాంధీ దారిపొడవునా ప్రజలను ఆత్మీయంగా పలకరించ••కుంటూ, దగ్గరికి తీసుకుంటూ, వారితో ఫోటోలు దిగుతూ, దారికిరువైపుల స్వాగతం తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయిన ప్రజలకు అభివాదం తెలుపుతూ, చేతులూపుతూ ఉత్సాహంగా యాత్రను కొనసాగించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా యాత్రలో పాల్గొంటున్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా గ్యాస్ సిలిండర్ ఆకారంలో ఉన్న కటవుట్ను, బ్యానర్ను పట్టుకుని ఆయనతో పాటు యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరయిన ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ..యుపిఏ అధికారంలో ఉన్న సమయంలో గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు దాటితేనే గగ్గోలు పెట్టారని ఇప్పుడు వేయి రూపాయలు దాటినా గాని ఒక్క మాట మాట్లాడడం లేదని మండిపడ్డారు.
ఆదివారం ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు కె మురళీధరన్, కెసి వేణుగోపాల్, రమేష్ చెనితల,విడి సతీషన్, ఎంపీ దీపేందర్ హుడా సహా పలువురు సీనియర్లు పాల్గొన్నారు. 150 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర సెప్టెంబర్ 30న కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.