- వెంటనే అపెక్స్ కమిటీ ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- లేఖ రాసిన కేంద్రమంత్రి షెకావత్
- వివరాలు వెల్లడించిన ఎంపి బండి సంజయ్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని చర్చించేందుకు త్వరలో అపెక్స్ కమిటీ భేటీ నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు రాసిన లేఖలో ధృవీకరించారు.పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవో నంబర్ 203పై తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు శనివారం నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 11గంటల
మధ్య తమ తమ ఇళ్ళపై నల్ల జెండాలు ఎగురవేయాలని బీజేపీ శ్రేణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కరీంనగర్లోని ఆయన నివాసంలో తన ఇంటిపై నల్ల జెండా ఎగరేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మొబైల్ యాప్ ద్వారా డియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203 కారణంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు లేఖ రాసామని తెలిపారు. దానికి ఆయన స్పందించారని సంజయ్ వివరించారు. తక్షణమే అఫెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కృష్ణాబోర్డును కేంద్ర మంత్రి షెకావత్ ఆదేశించారని తెలిపారు. ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామని సంజయ్
అన్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బండి సంజయ్ స్వయంగా వెల్లడించారు. పోతిరెడ్డిపాడు నీటి సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతోందన్నారు. దీన్ని భారతీయ జనతాపార్టీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని బండి సంజయ్ తెలిపారు.