- భూ నిర్వాసితులపై పోలీసుల దాడి
- ట్రయల్ రన్కు ముందుగా వందమంది అరెస్ట్
- తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 13 : సిద్ధిపేట జిల్లా గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు భూనిర్వాసితులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు ట్రయల్ రన్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పరిహారం చెల్లించకుండా ట్రయల్రన్ ఎలా చేస్తారంటూ భూ నిర్వాసితులు నిలదీస్తుండటంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ట్రయల్ రన్ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో గుడాటిపల్లిలో సుమారు 100 మంది భూనిర్వాసితులను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య గ్రామంలో కెనాల్ కాలువ కోసం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పంపు నీటిని విడుదల చేసి.. ఆ నీటిని ఈ కెనాల్ ద్వారా కుడి, ఎడమ కాలువలకు అనుసంధానం చేసి సాగునీరు విడుదల చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మీడియాను గ్రామంలోకి అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం, అధికారులు సామరస్యంగా తమ సమస్యలను పరిష్కరించాలి కానీ.. అర్ధరాత్రి వేళ పోలీసులతో దౌర్జన్యంగా తమ ఇళ్లపై దాడి చేయించడం ఏంటని భూ నిర్వాసితులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆడ-మగ అని తేడా లేకుండా కొట్టించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
మరోవైపు ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసుల దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. నిర్వాసితుల కాళ్లు, చేతులు విరగ్గొట్టారని ఆయన ఆరోపించారు. తలలు పగుల గొట్టారన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి పాలించడం మానుకోవాలని హితవు పలికారు.
వెంటనే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్ధరాత్రి పోలీసులు పేదల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని బండి సంజయ్ ఖండించారు. చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగలకొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్నట్లుండి అర్దరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. బాధితుల పక్షాన బీజేపీ పోరాడు తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.