ఆశావహులతో గాంధీభవన్లో నేతల భేటీ
ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడిన కోర్ కమిటీ సభ్యులు
11న ముఖ్య కార్యకర్తల సమావేశం?
దుబ్బాక ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై దృష్టి కేంద్రీకరించింది. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి పిసిసి చీఫ్ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో కోర్కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకుడు బోస్రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, సీనియర్ నాయకుడు నగేష్ యాదవ్, సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో పాటు టికెట్ ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ నర్సింహారెడ్డి(కెవిఎన్ఆర్), పన్యాల శ్రావణ్కుమార్రెడ్డి, కరణం శ్రీనివాస్రావు తదితరులు కూడా హాజరైనట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో పార్టీ స్థితిగతుల గురించి పార్టీ నేతలు ఆశావహుల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. గత ఎన్నికలలో పార్టీకి వచ్చిన వోట్లు…త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో పార్టీకి ఏ మేరకు వోట్లు వస్తాయి…ప్రజల మూడ్ ఎలా ఉంది, టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి, పార్టీ తరపున అభ్యర్థు ఎవరుంటారన్న దాని గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే, ఉప ఎన్నికలో రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి అందే సహకారం గురించి కూడా పార్టీ నేతలు ఆశావహులకు వివరించారనీ సమాచారం.
పార్టీ టికెట్ను ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్నర్సింహారెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి, కరణం శ్రీనివాస్రావుతో కోర్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారనీ, టికెట్ ఇస్తే అభ్యర్థిగా ఎంత వరకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారంటూ ఒక్కొక్కరినీ విడివిడిగా అడిగిన నేతలు… ఇప్పుడున్న పరిస్థితులలో ఉప ఎన్నికలో పార్టీ మాత్రం ఎలాంటి ఆర్థిక సహాయాన్ని అందించదనీ, ఈ విషయాన్ని ఆశావహులు గుర్తుపెట్టుకోవాలని కోర్కమిటీ సభ్యులు ఒకటికి పదిసార్లు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఒక్కో అభ్యర్థి తమ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు టికెట్ ఇస్తే ఎంత వరకు ఖర్చు పెట్టేది కూడా కోర్ కమిటీ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. పార్టీ కోసం ఎవరెవరూ ఏమేరకు కష్టపడ్డది, టికెట్ ఇస్తే ఎలా ముందుకెళ్తారనే విషయాన్ని కూడా కోర్కమిటీ సభ్యులు ఆశావహులను అడిగారనీ తెలుస్తుంది. అయితే, తాను రెండేళ్ల కిందటనే పార్టీలోకి వచ్చినప్పటికీ…పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాంను తన సొంత డబ్బులతో నిర్వహించినట్లు..తనకు టికెట్ ఇస్తే టిఆర్ఎస్ నుంచి కొందరు నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్లోకి తీసుకువస్తాననీ కూడా పార్టీ టికెట్ను ఆశిస్తున్న ఓ ఆశావహుడు పార్టీ నేతలకు వివరించినట్లు సమాచారం.
అయితే, టికెట్ ఎవరికీ ఇచ్చినప్పటికీ మిగతా వారందరూ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి తరపున ప్రచారం చేయాలనీ, పార్టీ నాయకత్వం కూడా దుబ్బాకలో ప్రచారం చేస్తుందనీ కోర్కమిటీ సభ్యులు ఆశావహులతో అన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 11న దుబ్బాక నియోజకవర్గంకు సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో గాంధీభవన్లో ప్రత్యేకంగా ఓ సమావేశాన్ని నిర్వహించాలనీ నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు టికెట్ను ఆశిస్తున్న అభ్యర్థులు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలను తీసుకురావాలని సూచించినట్లు సమాచారం. కాగా, 11న జరిగే మీటింగ్ తర్వాత దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది తేలనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారిన విషయం విధితమే.