- 20 కేసులు నమోదు…ఇంకా 40 మంది అనుమానితులు
- దేశంలోనూ వేగంగా విస్తరిస్తున్న వేరియంట్…166కు చేరుకున్న కేసులు
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు, అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలి టిమ్స్లో ఒమిక్రాన్ బాధితులతో పాటు, అనుమానితులు 40 మంది వరకు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో చేసిన టెస్టుల్లో మరో 9 మందికి కొరోనా పాజిటివ్ రావడంతో వారిని కూడా టిమ్స్ కు తరలిస్తున్నారు హెల్త్ సిబ్బంది. రిస్క్ కంట్రీస్ నుంచి వొచ్చే వారికే కాకుండా.. నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వొచ్చే వారికి కూడా కొరోనా టెస్ట్లు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్లో నెగిటివ్ వొచ్చిన వారికి…8వ రోజు మళ్లీ టెస్టులు చేస్తున్నారు. కొంతమందిలో 8 వ రోజు వైరస్ బయట పడుతున్నట్టు సమాచారం. ఇంకా 15 శాంపిల్స్ జినోమ్ రిపోర్టస్ వెయిటింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది.
దేశంలోనూ వేగంగా విస్తరిస్తున్న వేరియంట్..166 కు చేరుకున్న కేసులు
దేశంలోనూ కొరోనా డెల్టా వేరియంట్తో పాటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకే ఈ రెండింటిని కలిపి డెల్మిక్రాన్ అని పేరు పెట్టారు. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కలపడం ద్వారా ఈ నామకరణం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం రెండు రకాల కొరోనా వైరస్లు భారతదేశంతో సహా అన్ని దేశాల్లో వెలుగుచూస్తున్నాయి. కేరళలో నాలుగు, ఢిల్లీలో రెండు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఒమిక్రాన్ సోకిన వారి సంఖ్య 166 కి చేరుకుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోకాగా రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో, తెలంగాణ మూడో స్థానంలో, కర్ణాటక 4వ స్థానంలో, కేరళ ఐదో స్థానంలో ఉన్నాయి. అయితే శుభవార్త ఏమిటంటే కొరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పోరాడటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేసింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య రాజ్యసభలో వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల వల్ల భారతదేశం ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. దేశంలో ఈ కొత్త వేరియంట్ ఫిబ్రవరిలో అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ భయాందోళనకు కారణం ఏంటంటే కేవలం 27 రోజుల్లో అమెరికా, బ్రిటన్ దేశాలలో విపరీతమైన కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని 92 నగరాల్లో ఐసీయూలు దాదాపు నిండిపోయాయి. తక్కువ లక్షణాలున్న రోగులను ఇంటికి పంపుతున్నారు. బ్రిటన్లో ఒక్కరోజులో 10 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే 12 మంది రోగులు మరణించారు. ఇక్కడ క్రిస్మస్ ముందు లాక్డౌన్ విధించే అవకాశం ఉంది. ప్రపంచంలోని 80 కంటే ఎక్కువ దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 62 వేల మందికి పైగా ప్రజలు ఓమిక్రాన్ బారిన పడ్డారు.