- బిపామ్ అందజేసిన సిఎం కెసిఆర్
- నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం
- నేడు నామినేషన్లు వేయనున్న టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. నోముల నర్సింహయ్య తనయుడు భగత్కే టీఆర్ఎస్ టికెట్ దక్కింది. సోమవారం తెలంగాణ భవన్లో సిఎం కెసిఆర్ భగత్కు బిఫామ్ అందజేశారు. అలాగే పార్టీ ప్రచారం కోసం 28లక్షల చెక్ను కూడా అందించారు.
సోమవారం ఉదయం భగత్ నామినేషన్ వేస్తారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సిఎం కెసిఆర్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తదితరుల సమక్షంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి బిఫారమ్ అందచేశారు. అయితే నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు గత మూడు రోజులుగా 27, 28, 29లను సెలవు దినాలుగా ఈసీ ప్రకటించింది. దాంతో నేడు ఒక్క రోజే నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 20 మంది అభ్యర్ధులు 23 సెట్ల నామినేషన్స్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థిగా ప్రకటించకుండానే బీజేపీ సాగర్ ఇంచార్జ్ కంకణాల నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నేడు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకుని పోతున్నాయి. కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రచారంలో ముందున్నారు.
దిగ్గజ నేత జానారెడ్డిని ఢీకొట్టడం, నోముల కుటుంబానికి న్యాయం చేయడం వంటి అంశాలే ప్రాతిపదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సర్వేలు చేయించారు. నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో నోముల తనయుడు భగ••కే టికెట్ ఇచ్చారు. అయితే టికెట్ రేసులో ఉన్న ఎంసీ.కోటిరెడ్డికి త్వరలో ఎంఎల్సిగా అవకాశం కల్పిస్తానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సోమవారం అందరి సమక్షంలో భగత్ పేరును సీఎం ప్రకటించి బిఫామ్ అందజేయడంతో టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తరువాతే తమ అభ్యర్థిని ప్రకటించాలని ఇంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించిన జాతీయ పార్టీ బీజేపీ ఇప్పుడు అభ్యర్థి ఎంపికలో నిమగ్నమయింది. బీజేపీ కూడా తమ అభ్యర్థిగా కంకణాల నివేదితా రెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే నివేదితా రెడ్డి ఇప్పటికే నామినేషన్ వేయడం గమనార్హం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… ఆశావాహుల జాబితాలో ఉన్న అంజయ్య యాదవ్, నివేదితారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రవి నాయక్లతో చర్చలు జరిపి… చివరకు నివేదిత పేరును ఖరారు చేశారని తెలుస్తుంది. రాష్ట్రంలో సీనియర్ నేత, సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసిన జానా రెడ్డి బరిలోకి దిగుతుండటంతో ఆయనను ఓడించేందుకు ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీ.. రెండు పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి.