- పెరిగిన చరిష్మా….. జో బైడన్ను మించిన రేటింగ్
- ‘మోర్నింగ్ కన్సల్ట్’ సంస్థ సర్వేలో వెల్లడి
న్యూ దిల్లీ, జనవరి 21 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ నేతగా నిలిచారు. ఆయన ఛరిష్మా పెరిగిందే తగ్గలేదని నిరూపితం అయ్యింది. ప్రపంచ నేతల్లో మోదీ చరిష్మా ఇంకా కొనసాగుతూనే ఉందని.. డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మోర్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. 71 శాతం మంది సానుకూలంగానూ, 21 శాతం మంది వ్యతిరేకంగానూ స్పందించడంతో ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 శాతానికి పైగా ఉందని పేర్కొంది. అయితే.. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్కు అతి తక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చినట్లు తెలిపింది. ఆయన్ను చాలామంది నాయకుడిగా అభివర్ణించడం లేదని పేర్కొంది. కాగా.. ప్రపంచ నేతలకు సంబంధించిన ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ పరిశీలిస్తుంది. ఇలాభారత ప్రధాని నరేంద్రమోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోదీ అగ్రస్థానాన్ని సాధించారు. యూఎస్కు చెందిన గ్లోబల్ లీడర్ మార్నింగ్ సంస్థ తాజాగా రేటింగ్లను విడుదల చేసింది. 2022 సంవత్సరానికి గాను సర్వేలో.. భారత ప్రధాని 71 శాతం రేటింగ్తో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా అగ్రస్థానంలో నిలిచారు.
ఆ తర్వాత 66 శాతం రేటింగ్తో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ రెండో స్థానంలోను, 60 రేటింగ్తో ఇటలీ దేశానికి చెందిన మారియో డ్రాఘీ మూడో స్థానం సంపాదించారు. ఇక ఈ లిస్ట్లో చివరి స్థానంలో జపాన్ ప్రధాని సుగా నిలిచారు. ఈ సంస్థ 13 మంది ప్రపంచంలోని నాయకుల జాబితాను తన వెబ్సైట్లో విడుదల చేసింది. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 43 శాతం రేటింగ్తో ఆరోస్థానంలో నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో కూడా 43 శాతం రేటింగ్ సాధించారు. ఆస్టేల్రియా ప్రధాని స్కాట్ మారిసన్? 41 శాతం రేటింగ్ను సాధించారు. మోర్నింగ్ కన్సల్ట్ సంస్థ ఈ సర్వేను ప్రారంభించి నప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మోదీ అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి. అయితే.. ఈ మోర్నింగ్ కన్సల్ట్ ప్రపంచంలోని పలు దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్ను ట్రాక్ చేస్తుంది. ఏడు రోజులపాటు వయోజనులైన ప్రజల అభిప్రాయాన్ని పరిశీలించి ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు మోర్నింగ్ కన్సల్ట్ ప్రకటనలో తెలిపింది. ఈ అధ్యయనంలో పలు దేశాలకు సంబంధించిన వారు పాల్గొన్నట్లు తెలిపింది.