గ్రేటర్లో కొరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు వందలోపు ఉన్న కేసుల సంఖ్య.. అన్ లాక్ అవ్వగానే వందలలోకి చేరింది. రోజూ దాదాపు 500 నుంచి 900 కేసులు నమోదవుతున్నాయి. దాంతో నగర ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాలను మూసివేయాలని ఆ ప్రాంత అసోసియేషన్ నిర్ణయించింది. ఎప్పుడు కొనుగోలుదారులతో సందడిసందడిగా ఉండే సికింద్రాబాద్ జనరల్ బజార్ను, ఆ పక్కనే ఉండే సూర్యాటవర్స్ను, ప్యారడైజ్ సర్కిల్ ను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మూసివేత వచ్చే నెల 5 వరకు అమలులో ఉంటుందని అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.
భద్రాద్రి జిల్లాలో నలుగురికి కొరోనా నిర్ధారణ:
భద్రాద్రి జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని డీఎంహెచ్వో భాస్కర్నాయక్ ప్రకటించారు. రెండు రోజులక్రితం రామవరానికి చెందిన సింగరేణి కార్మికుడికి కరోనా సోకింది. దీంతో అతడిని చికిత్స కోసం దవాఖానకు తరలించారు. తాజాగా కార్మికుడి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించామని, వారిలో ముగ్గురికి కరోనా నిర్దారణ అయ్యిందని తెలిపారు. వీరితోపాటు లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లకు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకిందని చెప్పారు. అతడు ఈమధ్యే హైదరాబాద్ వెళ్లొచాడని డీఎంహెచ్వో తెలిపారు. జిల్లాలో మొదటి కరోనా కేసు మార్చి 14న నమోదయ్యింది.
కుమ్రం భీమ్ జిల్లాలో చిన్నారికి కొరోనా:
తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈసగావ్ గ్రామంలో కరోనా వైరస్ కలవరం సృష్టించింది. ఓ తొమ్మిదేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో.. ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చికిత్స నిమిత్తం చిన్నారిని హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కే బాలు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఢిల్లీ నుంచి ఇటీవలే ఈసగావ్ కు వచ్చారు. దంపతులిద్దరికి ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో వీరు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు అనే అంశాలపై వైద్యాధికారులు, పోలీసులు దృష్టి సారించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 26 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 22 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు వలస కూలీలే ఉన్నారని అధికారులు తెలిపారు.
మంచిర్యాల, ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్కు పాజిటివ్
హాస్పిటల్ మూసేసి సిబ్బందికి క్వారంటైన్
కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికమైపోతున్నాయి. జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యునికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో అధికారులు ఆ ఆస్పత్రిని మూసివేశారు. ఆ ఆస్పత్రి సిబ్బందినంతా అందులోనే క్వారంటైన్ చేశారు. వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. కాగా, ఆస్పత్రి వైద్యుడికి కరోనా సోకడంతో అందులో చికిత్స పొందిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.