ప్రతి సంవత్సరం మార్చి 24న ‘ప్రపంచ క్షయ నివారణ దినం’’ జరుపుకుంటాము. క్షయ వ్యాధి మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే భయంకరమైన అంటువ్యాధి. దీనిని టిబి అని కూడా పిలుస్తారు. జర్మనీ దేశానికి చెందిన రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధి రావడానికి కారణమైన సూక్ష్మజీవిని 1882 మార్చి 24న కనుగొన్నాడు. అందుకే ప్రతి సంవత్సరం ఇదే రోజున ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినంగా పాటిస్తున్నాము. క్షయ సూక్ష్మ జీవిని కనుగొన్నందుకుగాను ‘రాబర్ట్ కాక్’’కు 1905లో నోబెల్ పురస్కారం కూడా లభించింది. ఆయన చేసిన సేవకు గుర్తింపుగా ఈ వ్యాధిని వైద్యరంగంలో ‘కాక్స్ డిసీజ్’’ అని కూడా పిలుస్తుంటారు.
ఇది స్త్రీ, పురుషులనే భేదం లేకుండా ఏ వయసు వారికైనా, ఎప్పుడైనా రావచ్చును. క్షయ శరీరంలో రక్త ప్రసరణ ఉన్న(తల వెంట్రుకలు, గోళ్లు తప్ప) ఏ భాగానికైనా రావచ్చును. క్షయ సూక్ష్మ జీవికి ఆక్సిజన్ అవసరం కాబట్టి సాధారణంగా ఇది ఆక్సిజన్ ఎక్కువగా లభించే ఊపిరితిత్తులకు సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 1.3 మిలియన్ల మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారు. ప్రతిరోజూ 5వేల మంది క్షయ వ్యాధికి గురవుతున్నారు. సంవత్సరానికి 18 లక్షల మందికి క్షయ సోకుతుంది. భారత్లో సుమారు 34 లక్షల మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు, సగటున రోజుకు దాదాపు పదిహేను వందల మంది, సంవత్సరానికి ఐదు లక్షల మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారు. మన రాష్ట్రంలో 15 నిమిషాలకు ఒక క్షయ రోగి మరణిస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైద్య విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నది.
క్షయ వంశపారంపర్యమైన వ్యాధి కాదు. ఎక్స్-రే ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. గాలి, వెలుతురు తక్కువగా ఉండే గృహాలలో నివసించేవారు, పోషకాహార లోపం ఉన్నవారు, తరచూ ఈ వ్యాధికి చేరువలో ఉండే వారికి, మధుమేహ వ్యాదిగ్రస్తులలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధికి గురి కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
వైద్యుని సలహా ప్రకారం నివారణ ఔషధాలు క్రమబద్ధంగా తీసుకోవడం, మంచి పోషక ఆహారం తినడం, మంచి ఆరోగ్యకరమైన పరిసరాలలో నివసించడం వంటి చర్యలు ఈ వ్యాధిని నయం చేయడానికి సహాయపడుతాయి. ఈ వ్యాధి నుండి రక్షణ కొరకు చిన్న పిల్లలకు బిసిజి టీకాలు ఇప్పించాలి. వ్యాధిగ్రస్తులు మద్యం సేవించడం, పొగ త్రాగటం మానుకోవాలి. వాతావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ మధ్యలో మందులు మానివేయరాదు.
టేకుర్తి