ఆరునూరైనా దళితబంధు వంద శాతం అమలు

  • ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపేది లేదు
  • దళితుల అభివృద్ధి కోసమే పథకం
  • కొరోనాతో కారణంగా ఏడాది ఆలస్యం అయ్యింది
  • ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి
  • అభివృద్ధిలో రాష్ట్రం అద్భుతంగా దూసుకు పోతుందన్న కెసిఆర్‌
  • ‌సిఎం సమక్షంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరిన పెద్దిరెడ్డి

దళితబంధు పథకం ఆగే ప్రసక్తే లేదని..ఆరునూరైనా వంద శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు సీఎం తెలిపారు. దళితుల అభివృద్ధికి లక్ష కోట్లయినా ఖర్చు చేయనున్నట్లు పునరుద్ఘాటించారు. ఎంతో ఆలోచించి ఈ పథకాన్ని ముందుకు తీసుకుని వొచ్చామని అన్నారు. కొరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ ‌గులాబీ కండువా కప్పి పెద్దిరెడ్డిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం చాలా సంతోషం అన్నారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రుడని, ఇరువురం కలిసి ఒకేసారి మంత్రులుగా పనిచేసినట్లు తెలిపారు. ప్రజాసంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఆయన రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఎన్నో త్యాగాల తర్వాత రాష్టాన్న్రి సాధించుకున్నామని సీఎం అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని సీఎం తెలిపారు. పథకాల అమలులో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌ ‌వన్‌గా ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా చేపట్టడానికి తమకు ఏడాది కాలం పట్టిందన్నారు.

రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక అధికారి ఉన్నట్లు తెలిపారు. రైతు కుటుంబాలకు 10 రోజుల్లో బీమా సొమ్ము అందేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రైతుబీమా తరహాలోనే చేనేత కార్మికులకు సహాయం అందిస్తామన్నారు. గీత కార్మికుల కోసం చెట్ల పన్నులు తొలగించాం. ఎంబీసీ వర్గాల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం. ఇది మరింత పెరుగుతుందన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువన్నారు. పెంచిన సంపదను పంచడం ఎలా అనే ఆలోచిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసుకున్నట్లు తెలిపిన సీఎం ఇక పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్‌ఖ్తెతే తెలంగాణ కశ్మీరమే అవుతుందన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల వరిధాన్యం పండిందన్నారు. పల్లెలకు సంక్షేమం అందుతుంటే ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. గ్రామాలకు నిధులు వరుసపెట్టి వొస్తున్నట్లు సీఎం తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు ఆపుతాం కానీ గ్రామపంచాయతీలకు నిధులు మాత్రం ఆగేది లేదన్నారు. రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు తగ్గాయి.

దేశంలో అతి తక్కువ ఆత్మహత్యలు గల రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం తమకు పింఛన్‌ ‌కావాలంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులకు తిండి పెట్టడం లేదన్నారు. తల్లిదండ్రులను చూడని వ్యక్తులు దేశాన్ని అభివృద్ధి చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. ఏదైనా కొనొచ్చు కానీ తల్లిదండ్రులను కొనలేమన్నారు. 24 గంటల కరెంట్‌ ఇస్తా అంటే కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు జానారెడ్డి నమ్మలేదన్నారు. ఈ విషయంలో అసెంబ్లీలో సవాల్‌ ‌చేసినట్లు సీఎం తెలిపారు. 24 గంటల కరెంటు అమలు అయితే టీఆర్‌ఎస్‌ ‌కండువా కప్పుకుంటా అని జానారెడ్డి అసెంబ్లీలో అన్నారు. ఇచ్చిన మాట తప్పి జానారెడ్డి మొన్న నాగార్జునసాగర్‌లో పోటీ చేసి ఓడిపోయినట్లు తెలిపారు. చిల్లర అరుపులను పట్టించుకోకుండా అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నట్లు సీఎం తెలిపారు. ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తుంటాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపథంలో పడింది. ఈ ప్రస్తావన భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందన్నారు. మంచి-చెడు ప్రజలకు తెలుసని ఈ ప్రస్థానాన్ని ప్రజలు కాపాడుకుంటారని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పలువురు పాల్గొన్నారు.

breaking updates nowdalit bandhu scheme in tsdevelopmentheadlines nowKCR on Dalit Bandhushortnews in teluguToday telangana news
Comments (0)
Add Comment