ప్రతి దళితుడిని బలోపతేం చేసేలా కార్యక్రమం
పరస్పర విశ్వాసంతోనే విజయం సాధ్యం
మనుషులు కక్షలు, విద్వేషాలు విడనాడాలి
ప్రగతిభవన్లో హుజారాబాద్ దళితులతో భేటీలో సిఎం కెసిఆర్
సమావేశానికి 16 బస్సుల్లో ఎంపిక చేసిన 427 మంది దళితులు
తెలంగాణ ‘దళితబంధు’ కేవలం కార్యక్రమం కాదని..ఇది ఒక ఉద్యమమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. యావత్ తెలంగాణ దళితబంధు విజయం మీద ఆధారపడి ఉందని తెలిపారు. అందరూ ఆ దిశగా దృఢ నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘దళితబంధు’ కార్యక్రమంపై హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళిత బంధువులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ..హుజూరాబాద్ ప్రతినిధులు సాధించే విజయం వి•దేనని.. ఏ ఉద్యమం అయినా ఒక్కడితోనే ప్రారంభం అవుతుందని అలాగే తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కూడా ఒక్కడితో ప్రారంభమైందని అలా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని అన్నారు. నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం కొనసాగించినప్పుడు విజయం మనదేనని అన్నారు. భారత రాజకీయ వ్యవస్థపై వొత్తిడి తెచ్చి విజయం సాధిస్తామని ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
దళిత బంధు దేశానికే ఆదర్శం కానుంది.. రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనున్నామని కేసీఆర్ స్పష్టం చేసారు. అలాగే తాను నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం కొనసాగించినందువల్లే తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషితో దళిత సమాజంలో వెలుతురు ప్రసరించిందన్నారు. మనిషిపై మనిషి వివక్ష చూపే దుస్థితి గురించి..సెంటర్ ఫర్ సెబాల్టర్న్ స్టడీ ద్వారా అధ్యయనం చేసానని సీఎం తెలిపారు. దళితవాడల్లో ఇప్పటికే నమోదైన పరస్పర కేసులను పోలీస్స్టేషన్లలో రద్దు చేసుకోవాలని సూచించారు. పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంచుకోవాలని, అప్పుడే మన విజయానికి బాటలు పడుతాయన్నారు.
ఆర్థికంగా ప్రతీ దళితుడు బలపడాలని, అప్పుడే దళితులపై వివక్ష పోతుందని సూచించారు. మనుషులు కక్షలు, విద్వేషాలు విడనాడాలని..అవి పోతేనే సాటి మనిషిని మనిషిగా చూడగలమని సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితబంధువులతో పాటు 15 మంది రీసోర్స్ పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు. కాగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల దళిత బంధు పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 మంది దళితులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షలను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. దీంతో ఆ నియోజవర్గంలో రూ. 2 వేల కోట్లను ఈ పథకం కింద ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26న సీఎం కేసీఆర్ సారథ్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా దళిత బంధువులతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలను పంచుకున్నారు.
సమావేశానికి 16 బస్సుల్లో ఎంపిక చేసిన 427 మంది దళితులు
అంతకు ముందు ప్రగతిభవన్ వేదికగా జరిగే సదస్సులో పాల్గొనేందుకు ఎంపిక చేసిన 427 మంది దళితబంధువులు హుజూరాబాద్ నుంచి 16 బస్సుల్లో హుజూరాబాద్ నుంచి బయలుదేరి వొచ్చారు. వీరు ప్రయాణించిన బస్సులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. రోజంతా జరుగనున్న ఈ భేటీలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లోని ఒకో వార్డు నుంచి నలుగురు చొప్పున 412 మంది పురుషులు, మహిళలు, 15 మంది రిసోర్స్ పర్సన్స్.. మొత్తం 427 మంది దళితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో.. దళితబంధు పథక ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతోపాటు పథకాన్ని విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి అవగాహన కల్పించారు. అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె..వంటి అంశాలపై స్వయంగా సీఎం కేసీఆర్ చర్చించి వీరికి దిశానిర్దేశం చేశారు.