- ఉగ్రవాద చర్యలను ఎగదోయడం మానుకోవాలి
- ఉగ్రమూకలకు అండగా ఉండడం మీకు అలవాటే
- ట్విన్ టవర్స్ కూల్చిన లాడెన్కు ఆశ్రయమించిన ఘనత మీది
- కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్కు భారత్ ధీటైన జవాబు
ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్..ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా నటిస్తుందని భారత్ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ దుర్నీతి వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కుంటుందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్కు జవాబిస్తూ భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘పాకిస్థాన్ ప్రధాని భారత అంతర్గత విషయాలను ప్రస్తావించారు. తద్వారా ఈ వేదిక ప్రతిష్టను తగ్గించారు. ఈ క్రమంలో వారికి బదులిచ్చే హక్కును వినియోగించుకుంటున్నాం. ఓ అంతర్జాతీయ వేదికపై అవాస్తవాలతో విషం చిమ్మేందుకు పాక్ ప్రయత్నిస్తుంది. అందుకే నిజాల్ని ప్రపంచం ముందుంచాలను కుంటున్నాం. పాకిస్తాన్ కాశ్మీర్లో ఆక్రమించిన భాగాలు వెంటనే ఖాళీ చేయాలి’ అని అదే ఐక్యరాజ్యసమితి వేదికగా తీవ్రంగా హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితిలో భారతీయ దౌత్యవేత్త స్నేహా దూబే మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. పైగా పదే పదే అవాస్తవాలు వ్లలెవేస్తున్న నాయకుడి మానసిక స్థితిపై మనమంతా జాలిచూపాల్సి ఉందని దూబే పేర్కొన్నారు. తమని తాము ఉగ్రవాద బాధిత దేశంగా పాకిస్థాన్ చెప్పుకొంటుంది. ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటల్ని ఆర్పే వ్యక్తిలా పాక్ నటిస్తుంది. వారి విధానాల వల్ల యావత్తు ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కుంది.
పాక్ను ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశంగా ఈ ప్రపంచం చూస్తుంది. పైగా వారి దేశంలోని వేర్పాటువాద ఉద్యమాల్ని ఉగ్రవాద చర్యలుగా చిత్రీకరిస్తుందని ఐరాసలోని భారత ప్రతినిధి స్నేహా దూబే ధీటుగా బదులిచ్చారు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య భవంతులపై జరిగిన ఉగ్రదాడిని ఈ సందర్భంగా భారత్ ప్రస్తావించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ మారణహోమాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని వ్యాఖ్యానించింది. అంతటి ఘోరానికి పాల్పడిన ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్కు పాక్ ఆశ్రయమిచ్చిందని గుర్తు చేసింది. పైగా ఆ ముష్కరుణ్ని పాక్ నేతలు అమరుడిగా కీర్తిస్తున్నాయని పాక్ దుర్బుద్ధిని ఎండగట్టింది. ఇంకా పాకిస్థాన్ తమ ఉగ్రచర్యల్ని సమర్థించుకుంటుందని స్పష్టం చేసింది. ఈ ఆధునిక యుగంలో ఉగ్రసమర్థ చర్యలు ఏమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పింది. పాక్ సహా పొరుగు దేశాలన్నింటితో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటుందని దూబే ఐరాస వేదికగా స్పష్టం చేశారు. అయితే, పాక్ ఆ దిశగా చొరవచూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు విశ్వసనీయ, తిరుగులేని చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు.
సిక్కులు, హిందువులు, కైస్త్రవుల వంటి మైనారిటీలను పాక్లో అణచివేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం, నాయకుల మద్దతు సైతం ఉందని తెలిపారు. నిరసన తెలిపే గొంతుల్ని నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. అపహరణ, చట్టవిరుద్ధ మరణశిక్షలు పరిపాటిగా మారాయని గుర్తుచేశారు. ఐరాసలో ప్రసంగించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు అంశాన్ని లేవనెత్తారు. అలాగే ఇటీవల మరణించిన వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ పేరును సైతం తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇలా పాక్ నేత, ఐరాసలోని ఆ దేశ ప్రతినిధులు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం ఇది కొత్తేవి• కాదు. అయితే, ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మాత్రం పాక్ విఫలమైంది. ప్రపంచ దేశాలు దీన్ని ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశంగా పరిగణిస్తున్నాయి కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్పై దృష్టి పెట్టిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్పై మాటల దాడి చేశారు. దీనికి భారతదేశం ధీటుగా స్పందించింది. మొత్తం జమ్మూ కాశ్మీర్, లడఖ్ భారత్ అంతర్భాగం అని చెప్పిన భారత్.. అందులో ఎవరి జోక్యాన్నీ సహించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా అబద్ధాల ప్రచారానికి దిగిన ఇమ్రాన్ చెంప పగిలేలా హెచ్చరిక చేసింది. పాకిస్తాన్ చరిత్రలో ఉగ్రవాదులను ప్రోత్సహించడం..సహాయం చేయడం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు తెలుసు. ఇది పాకిస్తాన్ విధానంలో చేర్చి ఉందని దుబే అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతుండగా, పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఐరాస వేదికను ఉపయోగిస్తుందని ఆమె ఆరోపించారు.