ధాన్యం సేకరణలో… దిగిరాకుంటే తడాఖా చూపుతాం

  • ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం
  • ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా అవమానాలు
  • నూకలు తినమంటూ పీయూష్‌ ‌గోయల్‌ ‌వెక్కిరింపు
  • రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం ‌మాట్లాడుతున్నాడో తెలియదు
  • కెసిఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం
  • మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్‌,‌ప్రజాత్ర మార్చి 26 : ధాన్యంసేకరణలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే ఉగాది తరవాత కేంద్రానికి చేదు అనుభవమేమిటో రుచి చూపిస్తామని రాష్ట్ర మంత్రులు ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ ధాన్యాన్ని కొనాల్సిందేనని, అందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ‌వేముల ప్రశాంతరెడ్డి, పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌లు ప్రకటించారు. పంటలు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం వీరు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. వడ్లు కొనాలని ఎన్నిసార్లు విన్నవించనా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనబోమని, రా రైస్‌ ‌మాత్రమే కొంటామని కేంద్రం చెబుతుందన్నారు. తెలంగాణలో పండిన యాసంగి వడ్లు రా రైస్‌ ‌కి పనిరావని, బాయిల్‌ ‌చేయకుంటే నూకలు అవుతాయని చెబితే కేంద్రం వినడంలేదన్నారు. కావాలంటే మీ ప్రజలకు అవే నూకలు అలవాటు చేయాలని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తుందన్నారు. తెలంగాణ అంటే ఎందుకంత చిన్నచూపు అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర సమాజాన్ని అవమానించిన వాళ్ళు చరిత్ర పుటల్లో కలిసిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలను అవమానించిన వారు రాజకీయంగా జాడ లేంకుండా పోయారన్నారు. గతంలో రూపాయి కూడా ఇవ్వలేదన్న మాజీ సిఎం కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఏమయ్యోడో గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్రం ఇంత ఘోరంగా అవమానిస్తుంటే కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కేంద్రంతో వడ్లు కొనిపిస్తామని చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ మీద, కేసీఆర్‌ ‌మీద విషం గక్కుతున్నారని ఆరోపించారు. రైతుల గురించి కేంద్రం ఏమాత్రం ఆలోచించడంలేదని, తెలంగాణ రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేంద్రానికి ముందు చూపులేదని, పాలన చేతకాకపోతే దిగిపోవాలన్నారు. కేంద్రం స్పందించకుంటే ఉగాది తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని, అందుకు రైతులు సిద్ధంగా ఉండాలని కోరారు. అలాగే కెసిఆర్‌ ‌రైతులకు రక్షణ కవచంగా ఉంటారని వారు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కూడా నిరంజన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదని ఆక్షేపించారు. మంత్రి కిషన్‌ ‌రెడ్డి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. రైతుల ఉసురుపోసుకున్న సర్కార్లు నిలవలేక పోయానని తెలిపారు. కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని నిరంజన్‌ ‌రెడ్డి తేల్చిచెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం లేదన్నారు. దశాబ్దాల పెండింగ్‌ ‌ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశామని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతున్నామని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ ‌వ్యవసాయ రంగాన్ని గుర్తించి, ఈ రంగం మీద దృష్టి సారించారని తెలిపారు. దేశంలో పండించిన వ్యవసాయ పంటలను కొనే బాధ్యత కేంద్రానిదే అని నిరంజన్‌ ‌రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా లేకి మాటలు మాట్లాడుతున్నారు. హుందాతనం ప్రదర్శించట్లేదు. చచ్చేవరకు కేంద్ర మంత్రి పదవిలోనే ఉంటావా? అని కిషన్‌ ‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని నీ ఆత్మ చెప్పట్లేదా? తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వడ్లు తీసుకోవాలని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదు. మా వినతి పత్రాలను కనీసం చదవకుండా..తెలంగాణపై విషం కక్కుతారు. యజమాని బానిసతో మాట్లాడినట్లు కేంద్రం వ్యవహారం ఉందన్నారు. యూపీఎ హయాంలో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ.. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం సహకరించడం లేదని వ్యాఖ్యానించారని మంత్రి గుర్తు చేశారు. ఈ రోజు కేంద్రం మళ్లీ అదేవిధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాలానుగుణంగా కేంద్రం మారడం లేదు.. రైతుల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. ఇథనాల్‌ ‌తయారీ వైపు ఎందుకు దృష్టి సారించడం లేదు.. గతంలో మీరే దానికి జై కొట్టారని నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం మేం ఎన్ని అవమానాలైన భరిస్తాం.. కానీ సమయం వొచ్చినప్పుడు తెలంగాణ బదులు తీర్చుకుంటుందని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్రం తీరు అత్యంత అవమానకరంగా ఉంది.. ఇంత పెద్ద భారతదేశంలో రాష్ట్రాలతో కేంద్రం అనుసరించే తీరు బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 1 ‌వరకు అన్ని గ్రామపంచాయతీలు, మండలాలు, జడ్పీలలో కేంద్రం వడ్లు కొనాలని తీర్మానాలు చేసి ప్రధానికి పంపుతామని మంత్రి తెలిపారు. కేంద్రం మార్గాలు వెతకాలి. కాలానుగుణంగా మార్పులు రావాలి. ఇథనాల్‌ ‌ప్రొడక్షన్‌ 2025 ‌నాటికి 20 శాతం పెంచుతామన్నారు. ఇప్పటి వరకూ 5శాతం దాటలేదు.

గోదాములు ఖాళీ లేవంటున్న కేంద్రం… ఎందుకు ఖాళీ చేయడం లేదు. ప్రజలకు బియ్యాన్ని పంచరెందుకు?. కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు లేవు. 28, 29న సార్వత్రిక సమ్మె చేస్తాం. ఉగాది తర్వాత ఉదృతమైన ఉద్యమం చేస్తాం. ఇప్పటికే కార్యాచరణ సిద్ధం అయింది. ఇది దక్షిణ భారతదేశం మొత్తం పాకడం ఖాయం. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌సూచన మేరకు పీయూష్‌ ‌గోయల్‌ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కిషన్‌ ‌రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి.. ఒక్కసారైనా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. ‘కేంద్రం కావాలనే తెలంగాణపై తప్పుడు ప్రచారం చేస్తుంది. మెడమీద కత్తి పెడితే రైతుల ప్రయోజనాల కోసం..బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వమని రాసిచ్చాం. కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాలని 16 సార్లు లెటర్లు రాశాం. నెలకు 10 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కేంద్రానికి పంపగలం..తీసుకెళ్లమంటే మా దగ్గర ర్యాకులు లేవని వాళ్లే అన్నారు. పైగా సమయానికి సప్లై చేయడం లేదని అభాండాలు వేస్తున్నారు. మేం చేసిన ప్రయత్నాలన్నీ కిషన్‌ ‌రెడ్డికి తెలిసేలా లెటర్లు పంపిస్తాం. వాటిని చూసి అయినా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నించాలని కోరుతున్నాం’ అని మంత్రి గంగుల అన్నారు. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. శనివారం వి•డియాతో మాట్లాడుతూ… ఏప్రిల్‌ ‌రెండు వరకు కేంద్రం స్పందన కోసం చూస్తామని…ఆ తర్వాత ఉగ్ర రూపాన్ని కేంద్రానికి చూపిస్తామని తెలిపారు. రైతులతో పెట్టుకుంటే పొట్టు అవుతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఉడుకుతున్నారన్నారు. ఆ ఉడుకు ఏంటో ఉగాది తర్వాత చూస్తారని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్‌కు దమ్ముంటే ధాన్యం కొనేలా చేయాలి : మంత్రి వేముల
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి సవాల్‌ ‌విసిరారు. తెలంగాణ బిజెపి అధ్కయక్షుడిగా వడ్లు పండించాలని అన్న సంజయ్‌ ‌తన హామీని నెరవేర్చాలన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. వడ్లు పండిస్తే కేంద్రమే కొంటుందన్న సంజయ్‌ ‌వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ఆయన మీడియా సమావేశంలో వినిపించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పంజాబ్‌లో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుండి వానాకాలం, యాసంగి ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. కానీ కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌వ్యవహరించిన తీరు, తెలంగాణ ప్రజలను అవమానించిన తీరు గుండెల నిండా బాధ నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు.

prajatantra newstelangana updatestelugu kavithaluTelugu News Headlines Breaking News NowToday Hilightsతెలుగు వార్తలు
Comments (0)
Add Comment