- అల్పపీడనంతో పాటు చురుకుగా రుతుపవనాలు
- జిహెచ్ఎంసికి, 16 జిల్లాలకు రెడ్ అలర్ట్
- నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద
- కందకుర్తి వద్ద గోదావరి ఉధృతి..జూరాలకు పెరిగిన వరద
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత… పలుప్రాంతాలు జలమయంతో తీవ్ర ఇక్కట్లు
అల్పపీడనానికి తోడు రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. జిహెచ్ఎంసికి, 16 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో భారీ వర్షం పడుతుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది.
గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టుతోపాటు 625 చెరువులు నిండుకుండల్లా మారాయి. పాలమూరు జిల్లాను వర్షం కుమ్మేసింది. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని పెద్ద చెరువు అలుగు పారింది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 61,310 క్యూసెక్కుల నీరు వొస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1,24,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 7500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వొదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం 1090.5 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. గరిష్ఠ నీటినిల్వ 90 టీఎంసీలకుగాను 87.561 టీఎంసీలు ఉన్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో క్రమంగా ప్రవాహం పెరుగుతున్నది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద ఉగ్రరూపం దాల్చింది.
ఆదివారం తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కుండపోతగా వాన కురిసింది. దీంతో గోదావరిలోకి భారీగా వరద వొచ్చి చేరుతున్నది. కందకుర్తి వద్ద పురాతన శివాలయం పూర్తిగా నీటమునిగింది. జుక్కల్లోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 2,454 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మిటర్లుగా ఉండగా.. ప్రస్తుతం 457.70 మిటర్లుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 1.237 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.165 టీఎంసీలుగా ఉంది. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వొచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో 93,836 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1,01,558 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.230 టీఎంసీలుగా కొనసాగుతుంది.
ఇకపోతే మూసీ ప్రాజెక్ట్కు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,343 క్యూసెక్కులు కొనసాగుతుంది. మూసీ పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.62 టీఎంసీలుగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల ఇన్ఫ్లో 1.03 లక్షల క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మిటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.390 మిటర్లు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.39 టీఎంసీలు. ఇదిలా ఉంటే ఆంధప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ నెల 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరించింది. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత… పలుప్రాంతాలు జలమయంతో తీవ్ర ఇక్కట్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. పలుప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మం పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరో మూడు రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికతో… అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. పునరావాసకేంద్రాలను సిద్దం చేసుకోమని, లోలెవల్ బ్రిడ్జ్లపై రాకపోకలు నిషేదించమని, చేపలువేట,సెల్ఫీలపై నిషేదించాలని ఆదేశాలు ఇచ్చారు.ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులు.. వర్షం నీటితో మునిగాయి.