- జిహెచ్ఎంసి అధికారుల తీరుపై పిసిసి చీఫ్, ఎంపి రేవంత్ ఫైర్
- మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యాడన్న ఎంపి
- మ్యాన్ హోల్ మృతుల కుటుంబాలకు పరామర్శ
- కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్
జీహెచ్ఎంసీ అధికారులపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో రేవంత్ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై సీఎస్ సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రివ్యూ చేయకపోవడం బాధాకరమన్నారు. మ్యాన్ హోల్లో మనుషులను దింపి పనిచేయించడం నిషేధమని అయినా వారిని ఎలా దింపారని రేవంత్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం లోపు చేయకపోతే.. నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇదిలావుంటే మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా హైదరాబాద్ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి రూ.600 కోట్లు విడుదల చేసి.. వరద బాధితుల పేరుతో రూ.300 కోట్లు టీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.
దళిత బందు తెచ్చామని గొప్పలు చెప్పే ప్రభుత్వం.. దళిత కార్మికులు చనిపోతే… వారి కుటుంబాలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇద్దరు దళితులు చనిపోతే పరామర్శించడానికి జీహెచ్ఎంసీ అధికారులు రాలేదని తప్పుబట్టారు. అంతయ్య మృతదేహం గాలింపు చర్యలు వేగవంతం చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి నష్ట పరిహారం ఇవ్వాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే సాహెబ్నగర్ బాధిత కుటుంబాలను రేవంత్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. గతేడాది వర్షాలు వచ్చి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని, చాలా నష్టం వాటిల్లిందన్నారు. నాలాల పునరుద్ధరణ చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని మండిపడ్డారు. ఏడేళ్లుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని రేవంత్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి శివ, అంతయ్య కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని అన్నారు. రెండు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రూ.లక్ష ఆర్థిక సహాయం చేసిందన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం మ్యాన్ హోల్ దిగడానికి వీల్లేకున్నా చట్టాన్ని ఉల్లంఘించి మ్యాన్ హోల్లో దింపారని మండిపడ్డారు. ఐదు రోజులు గడుస్తున్నా అంతయ్య ఆచూకీ తెలవకపోవడం దారుణమని తెలిపారు.