- నెల రోజులపాటు వరంగల్ డిక్లరేషన్పై చర్చ
- అక్కంపేట రచ్చబండలో పాల్గొననున్న రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి రైతు రచ్చబండ నిర్వహిస్తుంది. వరంగల్ రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీపీసీసీ రైతు రచ్చబండ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరైన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో చేపట్టే రైతు రచ్చబండను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన అక్కంపేటకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కంపేటకు చేరుకొని రైతు రచ్చబండలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని టీపీసీసీ మే 21 నుండి నెలరోజుల పాటు రైతు రచ్చబండ నిర్వహిస్తోంది. కాగా రాష్ట్రంలోని 1200కు పైగా గ్రామాల్లో రచ్చబండ చేపట్టేందుకు టీపీసీసీ ప్రణాళిక రచించింది.
వరంగల్ డిక్లరేషన్ను జనంలోకి బలంగా తీసుకెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ డిక్లరేషన్కు మంచి గుర్తింపు వొచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ పాల్గొన్న వరంగల్ రైతు సంఘర్షణ సభలో తీసుకున్న వరంగల్ డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ముఖ్యనాయకుడు 21వ తేదీన ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలని నిర్ణయించారు.
30 రోజులపాటు అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాలు జరుగుతాయని రేవంత్ తెలిపారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజక వర్గాల్లో 15 మంది ముఖ్యనాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. పెరిగిన ధరలపై కూడా కార్యక్రమాలు చేపడతామని రేవంత్ వెల్లడించారు.