భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని దిల్లీ కంటోన్మెంట్లోని సైనిక హాస్పిటల్ వెల్లడించింది. వెంటిలేటర్ సహాయంతోనే చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అయితే.. ఆయన ఆరోగ్య సూచీలు మాత్రం నిలకడగానే ఉన్నాయని తాజా హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కొరోనా వైరస్ సోకినట్లు తేలింది. అనంతరం ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.