- రాష్ట్ర వ్యాప్తంగా 7,700 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- ధాన్యం కొనుగోళ్ల కోసం 25 వేల కోట్ల కేటాయింపు
- అర్ధిక మంత్రి తన్నీరు హరీష్రావు
రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వ ధ్యేయమని అర్ధిక మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ముండ్రాయిలో వరి కొనుగోళ్ల కేంద్రం ప్రారంభం, వలస కార్మికులకు ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం, ఒక్కొక్కరికి రూ.500 రూపాయల నగదు పంపిణీ , పాలమాకులలో వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు, ఆరేపల్లిలో మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రం, గట్ల మల్యాల గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ లతో కలిసి మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ….రైతులకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా.. కష్టకాలంలో సైతం రైతుబంధు డబ్బులు ప్రభుత్వం అందించిదని గుర్తు చేశారు. కరోనా విపత్కర కాలంలో కూడా రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరువుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల 700 వరి కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభిస్తున్నాట్లు తెలిపారు. దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైందని పేర్కొన్నారు.
వరిధాన్యం క్వింటాళుకు 1835 రూపాయల మద్దతు ధర ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. చాలా రాష్ట్రాల్లో కేవలం 10, 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు చేస్తామని సీలింగ్ పెట్టినప్పటికీ తెలంగాణలో మాత్రం మొత్తం పంటను కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. చివరి గింజ వరకూ కోని, రైతులకు మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో గతేడాది రబీలో 60వేల 370 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఈ యేడాది లక్షా 52 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు తెలిపారు. ఈమేరకు 3 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాలో మొక్కజొన్న 18వేల ఎకరాల్లో పండిందని, 4 లక్షల 29 వేల 880 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోళ్లు చేసేందుకు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.
జిల్లాలో 20 వేల క్వింటాళ్లు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండిందని అధికారిక లెక్కల ప్రకారం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోళ్ల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోని 5650 రూపాయల మద్దతు ధర పొందాలని పొద్దు తిరుగుడు రైతులకు మంత్రి సూచించారు. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం 58వేల క్వింటాళ్ల శనగ పంట పండినట్లు తెలుస్తుందన్నారు. శనగ పంట కొనుగోలు కోసం శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. శనగకు కొనుగోలు కేంద్రాలల్లో పంటను అమ్ముకొని మద్దతు ధర 4870 రూపాయలు పొందాలని రైతులకు మంత్రి సూచించారు. ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.