- క్యాన్సర్ తదితర రోగాలకు దూరం
- క్యాన్సర్ అవగాహనాకార్యక్రమంలో ఇవో ధర్మారెడ్డి
తిరుపతి, అక్టోబర్ 8 : ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు క్యాన్సర్పై శ్వేత ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన కార్యక్రమాన్ని తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన ముఖ్యమని చెప్పారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు లేదన్నారు. మాంసాహార భోజనం, పాశ్చాత్య ఆహార అలవాట్లు క్యాన్సర్కు ఒక కారణమని చెప్పారు.
గోవును రక్షించి గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను తింటే వంద శాతం క్యాన్సర్ రాకుండా చూడవచ్చన్నారు. టీటీడీ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి రైతుల నుంచి 12 రకాల ఉత్పత్తులు కొనుగోలు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందన్నారు. ప్రముఖ సినీ నటి గౌతమి మాట్లాడుతూ క్యాన్సర్ వస్తే చావు ఖాయమనే భయం ఏమాత్రం అవసరం లేదని, ఇందుకు తానే నిదర్శనమని అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా క్యాన్సర్ రావచ్చని, సరైన ఆహార అలవాట్లు, రసాయన రహిత ఉత్పత్తుల వినియోగం వల్ల దీనికి అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మహిళలు సమస్యలను ఎదిరించి పోరాడితేనే సమాజంలో నిలబడగలుగుతారని అన్నారు. తనకు క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎదురైన అనుభవాలను వివరించారు.