- దేశ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య.. 70,756
- వారం రోజుల్లో 24,323 మందికి పాజిటివ్
- వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
దేశంలో కొరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్నది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 24,323 మందికి పాజిటివ్ అని తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మే 5న ఉదయం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,433గా ఉన్నది. సరిగా వారం గడిచేవరకు 12 నాటికి ఆ సంఖ్య 70,756కి పెరిగింది. అంటే ఏడు రోజుల వ్యవధిలోనే 24,323 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మే 5న దేశంలో 32,138 యాక్టివ్ కేసులు ఉండగా, 12,726 మంది బాధితులు కోలుకున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల మొత్తం 1568 మంది మృతిచెందారు. కాగా తాజాగా కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 46,008గా ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 22,454కు చేరింది. అంటే గతవారంతో పోల్చితే యాక్టివ్ కేసులు మరో 14 వేలు పెరగగా, కోలుకున్న బాధితుల సంఖ్య పది వేలు మాత్రమే పెరిగింది. అయితే నమోదైన కేసులు మాత్రం వీటికి రెట్టింప్పయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్తో 2293 మంది మరణించారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 23,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 868 మంది మరణించారు.
గుజరాత్లో కరోనా కేసుల సంఖ్య 8,541కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్తో 513 మంది బాధితులు మృతిచెందారు. ఇక తమిళనాడులో కరోనా కేసులు గత మూడు రోజులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 8002 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 7,233 కరోనా కేసులు ఉన్నాయి. భారత్లో కరోనా లాక్డౌన్ సడలింపులు, వలస కార్మికుల తరలింపు తదితర చర్యల నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరిగి యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా అధికం కానుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. భారత్ విషయానికి వస్తే మంగళవారం ఉదయం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,756 కాగా…మృతుల సంఖ్య 2,293గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 46,008 అని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందికిపైగా ప్రమాదకర మహమ్మారి కొరోనా వైరస్ బారిన పడగా.. వారిలో 2,8లక్షలకుపైగా మృత్యువాత పడ్డారు. అయితే, సుమారు పదిహేను లక్షల మంది కోలుకోవటం కాస్త ఊరట కలిగించే విషయం. అంతర్జాతీయంగా కరోనా కేసుల తాజా సమాచారాన్ని అందించే వెబ్సైట్ ’వరల్డో టర్’ గణాంకాల ప్రకారం… కొవిడ్-19 కేసుల సంఖ్యలో భారత్ అంతర్జాతీయంగా 13వ స్థానంలో ఉంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య.. అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, స్పెయిన్లో అధికంగా ఉండగా… ఈ జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉండటం గమనార్హం. భారత్ తర్వాతి స్థానాల్లో పెరూ, టర్కీ, నెదర్లాండ్స్, కెనడా, బెల్జియం, సౌదీ అరేబియా తదితర దేశాలున్నాయి.