- సమరశంఖం పూరించిన ప్రియాంక గాంధీ
- లక్ష ఉద్యోగాల కల్పనకు హా ఇచ్చిన కాంగ్రెస్ నేత
న్యూ దిల్లీ, అక్టోబర్ 14 : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారభేరీ మోగించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల శంఖారావం పూరించారు. పార్టీని గెలిపిస్తే తొలి క్యాబినెట్ సమావేశంలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటిచారు. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, వృద్దాప్య పింఛను పథకం అమలు చేస్తామని వాగ్దానం చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్ లో శుక్రవారం జరిగిన ’పరివర్తన్ ప్రతిజ్ఞ ర్యాలీ’లో ఆమె మాట్లాడారు. ఈ ర్యాలీతో హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ప్రియాంక శ్రీకారం చుట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు ఉనా, చంబాలో రెండు ర్యాలీల్లో పాల్గొన్న మరుసటి రోజే ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఆలోచించాలని ర్యాలీకు హాజరైన ప్రజలకు ప్రియాంక సూచించారు. బీజేపీకి పెన్షన్లు ఇవ్వడానికి డబ్బుల్లేవని, బడా పారిశ్రామికవేత్తలకు రుణాలు మాత్రం మాఫీ చేస్తారని విమర్శించారు. యువకులకు, ఉద్యోగులకు, మహిళలకు బీజేపీ చేసిందే లేదని, గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీనే జరగలేదని అన్నారు.
తాము అధికారంలోకి రాగానే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటు, వృద్దాప్య పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని హా ఇచ్చారు. కాగా, ఎన్నికల ప్రచారానికి ముందు సోలాన్లోని మా శూలిని ఆలయాన్ని ప్రియాంక సందర్శించి పూజలు చేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిభా సింగ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్పర్సన్ సుఖ్వీందర్ సింగ్, పార్టీ సీనియర్ నేత రాజీవ్ శుక్లా తదితరులు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.