- వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సమూల మార్పులు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ,జూన్ 23 : రాష్ట్రంలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్మోహనరెడ్డి కార్యాచరణు రూపొందిస్తున్నారని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడలో మంత్రి కొడాలి నానిని వైసీపీ నందివాడ మండల అధ్యక్షుడు పెయ్యల ఆదాం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల ఇంటర్వ్యూల సమాచారం ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ సమాచారం తెలియకపోవడం వల్ల అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని చెప్పారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో రెండు అంగన్ వాడీ టీచర్, 12 అంగన్ వాడీ ఆయా పోస్టులకు ఈ నెల 16 వ తేదీన గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయని చెప్పారు. ఈ పోస్టులకు 76 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అంగన్ వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలను ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించడం లేదని, ఒక్క సెంటర్ను కూడా మూసివేయడం లేదని సీఎం జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారన్నారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ విద్యా విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఇంగ్లీష్ డియంలో చెప్పాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆరాటపడుతున్నారని, పిల్లలకు మంచి విద్యనందించాలని తపిస్తున్నారన్నారు. ఇందు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదన్నారు. నూతన విద్యా విధానంపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తామన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో నాడు – నేడు అమలుకు కూడా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సమూల మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 55 వేల అంగన్వాడీ కేంద్రాలున్నాయని, వీటిలో ఏ ఒక్క కేంద్రాన్ని తగ్గించేది లేదని తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతాయన్నారు. ఇవన్నీ రెండేళ్ళలో పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని తెలిపారు. నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. భవిష్యత్ తరాలకు కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయన్నారు. ఆట స్థలం లేని పాఠశాలలకు నాడు – నేడులో భాగంగా భూమిని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. వచ్చే జూలై 1 వ తేదీ నుండి నాడు – నేడు రెండవ విడత ప్రారంభం కానుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.