- డిసీజీఐ అనుమతితో వేగంగా పరిశోధనలు
- ఆగస్ట్ కల్ల విడుదల చేసేందుకు సన్నాహాలు
కొరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి అనేక ఫార్మా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం ద 17 కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఈ 17 కంపెనీల్లో కొన్ని ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాయి. భారత్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు చేస్తున్నది. ఈ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ వాక్సిన్పై మరిన్ని ప్రయోగాలు చేయడానికి డిసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో ఆగస్ట్ 15 కల్లా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని భారత్ బయోటెక్ ప్రకటించింది.
ఇప్పుడు ఈ కంపెనీతో పాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన జైడస్ కాడిలా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా డిసిజీఐ అనుమతి పొందింది. దేశంలో డిసిజీఐ అనుమతి పొందిన రెండో ఫార్మా కంపెనీ ఇదే కావడం విశేషం. డిసిజీఐ అనుమతి పొందటంతో జైడస్ కంపెనీ తన వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నది. అయితే, కొరోనా వ్యాక్సిన్ను తయారు చేయడంలో ఆస్టాజ్రెనికా, మోడెర్నా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. మూడో దశ ప్రయోగాలకు ఈ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. అటు చైనాకు చెందిన పలు కంపెనీలు కూడా కొరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు చేస్తున్నాయి.