కెసిఆర్ తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది
లిక్కర్ దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు
నందన్ గ్రామ రచ్చబండలో బండి సంజయ్ విమర్శలు
పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సీఎం కేసీఆర్ ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని నందన్ గ్రామంలో పాదయాత్ర చేస్తున్న ఆయన మాట్లాడుతూ లిక్కర్ , క్యాసినో దందాల్లో కేసీఆర్ బిడ్డ వేలకోట్ల పెట్టుబడులు పెట్టారని, ఇక్కడున్నవి బెల్ట్ షాపులు కాదని.. అవి కేసీఆర్ షాపులని ఆరోపించారు. లిక్కర్ దందాలో ఎమ్మెల్సీ కవిత వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు. నందన్ తండాలో జరిగిన రచ్చబండలో మాట్లాడిన బండి సంజయ్.. ఫాంహౌజ్ లో వ్యవసాయం చేసే కేసీఆర్ కోటిశ్వరుడైతే… అన్నదాతలు ఎందుకు అప్పులపాలైతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టు పక్కల భూముల్ని కబ్జా చేసేందుకే ధరణి తీసుకొచ్చారని విమర్శించారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదన్నారు. రాష్ట్రంలో అమలౌవుతున్న ప్రతీ స్కీంలో కేంద్రం పైసలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సమయంలో వచ్చి..ఎన్నికల తర్వాత పత్తా లేకుండా పోతరని బండి సంజయ్ అన్నారు..
కేసీఆర్.. అయితే పెళ్లి కోరుతరు..లేకపోతే చావు కోరతారన్నారు. మోడీ ఛాయ్ అమ్మిన వ్యక్తని..ఆయన పేదోళ్ల గురించి ఆలోచిస్తారన్నారు. తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. స్కూళ్లల్లో విద్యార్థులుంటే.. టీచర్లు లేరు.. టీచర్లు ఉంటే.. విద్యార్థులు లేరని విమర్శించారు. ముఖ్యమంత్రి 100 రూములతో ఇల్లు కట్టుకున్నారని, 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తు కోట్లు గడిస్తున్నారని.. రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారని అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన జాగాలను కబ్జా చేసేందుకే ’ధరణి ’ తెచ్చారని విమర్శించారు. తెలంగాణ రైతులను పట్టించుకోని కేసీఆర్…. పంజాబ్ రైతులకు మాత్రం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని.. చివరికి ఆ చెక్కులు బౌన్స్ అవడంతో తెలంగాణ ఇజ్జత్ పోయిందన్నారు. పేదోళ్ల సమస్యలు, బాధలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశిస్తేనే… పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
నిర్దేశిత గడువు లోపల జమ చేయక పోవడమే
సాంకేతిక లోపం .. :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : ఇటీ వల దేశ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 22 మే 2022 న పంపిణి చేసిన 1010 చెక్కులలో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయనీ. కాగా, బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల మిగిలిన చెక్కులను బ్యాంకు లో లబ్ధిదారులు జమ చేయకపోవడం వల్ల మిగిలిన కొన్ని చెక్కులకు నగదు చెల్లింపులు చేయక నిలిపివేయబడ్డాయని నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,సోమేష్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోటికాదు.ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. సంబంధిత బ్యాంకులకు గడువుదాటిన తర్వాత డిపాజిట్ చేసినారని చెప్తున్న మిగిలిన చెక్కులకు మరికొంత సమయం ఇచ్చి, నగదు చెల్లింపులు జరిగే విధంగా అనుమతివ్వాలనీ, (రీవాలిడేట్ చేయాలని) ప్రభుత్వం ఇప్పటికే ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది అని ప్రకటనలో తెలిపారు.