విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం
పోలీస్ కేసు నమోదు..ప్రొఫెసర్ సస్పెన్షన్
హైదరాబాద్,ప్రజాతంత్ర: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్లాండ్కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ విషయం తెలుసుకున్న యూనివర్సిటీ విద్యార్థులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అత్యాచార ఆరోపణలు రావడంతో ప్రొఫెసర్ రవి రంజన్ను సస్పెండ్ చేశారు. తప్పించుకుని వచ్చిన బాధితురాలు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థాయ్లాండ్ చెందిన విద్యార్థిని హెచ్సియులోని హిందీ డిపార్ట్మెంట్లో స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ చదువుతోంది. అదే డిపార్ట్మెంట్లో రవి రంజన్ హిందీ ప్రొఫెసర్గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి సదరు విద్యార్థినిపై రవి రంజన్ కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేస్తుండగా తప్పించుకుంది. తొటి విద్యార్థులకు తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీచక ప్రొఫెసర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ పాడు పనులు చేస్తే ఎలా అని విద్యార్థులు మండిపడ్డారు. ప్రతి చోటు మహిళలకు రక్షణ లేకుండాపోయిందని వాపోయారు.